ఆ రోజే ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. రాజ్యసభకు ఎన్నికైన నేపథ్యంలో ఇద్దరు మంత్రులు మోపిదేవి వెంకటరమణారావు, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌లు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఖాళీ అయిన మంత్రి పదవులను భర్తీ చేయడానికి వీలుగా విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆషాఢమాసం ముగిసిన తర్వాత శ్రావణమాసం ప్రారంభంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టే అవకాశముందని సమాచారం. కాగా, శ్రావణ మాసం 21వ తేదీ నుంచి ప్రారంభమవుతోంది. దీంతో 22వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే వీలున్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం మంత్రి పదవులకు రాజీనామా చేసిన ఇద్దరు నేతలు బీసీ వర్గానికి చెందినవారు. కొత్త మంత్రులను కూడా బీసీ వర్గం నుంచే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎంపిక చేస్తారని భావిస్తున్నారు. అంబటి రాంబాబు, విడదల రజిని వంటి వారు మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో ఉన్నారు.