ఈనెల 11న ఏపీ కేబినెట్‌ విస్తరణ.. వారిద్దరికేనా చోటు?

 

ఏపీ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 11న మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు సమాచారం. నిబంధనల ప్రకారం సీఎంతో కలిపి మొత్తం 26 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎస్టీ, ముస్లిం మైనార్టీలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యంలేదు. దీంతో ఈ రెండు స్థానాలను భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముస్లిం మైనారిటీల్లో రాయలసీమకు చెందిన నేతకే ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌ఎండీ ఫరూక్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. ఇక ఎస్టీల విషయానికి వస్తే.. ఇటీవల మావోల చేతిలో హత్యకు గురయిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రవణ్‌ని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం.