హీటెక్కనున్న ఏపీ అసంబ్లీ...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్ లో అధికార వైసిపిని ప్రజా సమస్యల పై ఇరుకున పెట్టాలని టిడిపి భావిస్తుంటే టిడిపి ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకుని ప్రతి పక్ష హోదా లేకుండా చేయాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరికొంత మంది వస్తారని అధికార పార్టీ నేతలే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చంద్రబాబుకు సవాల్ గా మారింది. అసెంబ్లీ సమావేశాల్లో వల్లభనేని వంశీ ఎక్కడ కూర్చుంటారు,స్పీకర్ ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తారు అన్నది ఆసక్తిగా మారింది.

అధికారికంగా ఆయన పార్టీ మారలేదు కాబట్టి విపక్షా లకు కేటాయించిన సీటులోనే ఉంటారని టిడిపి వర్గాలంటున్నాయి. ఒకవేళ ఆయన రాజీనామా చేయకుండా వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుంటే వంశీ పై అనర్హత వేటు వేయాలని టిడిపి స్పీకర్ ను కోరే అవకాశముంది. ఇప్పటికే ప్రభుత్వం పలు కీలక బిల్లులను సిద్ధం చేసింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భాషలో ఆయా రంగాల్లోని విధానాలను సమూలంగా మార్చింది. కొత్తగా మైనింగ్, మద్యం, ఇసుక పాలసీని తీసుకొచ్చింది. వీటికి అనుగుణంగా బిల్లులు పెట్టి అవకాశముంది. నూతన బార్ల పాలసీ కూడా చర్చకు రానుంది. పలు సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం చర్చకు పెట్టి ఆస్కారముంది. అటు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టిడిపి వ్యూహాలు రచిస్తోంది.

తొలి రోజే ఉల్లితో పాటు ఇతర నిత్యావసర ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానం ఇవ్వాలని టీడీఎల్పీ నిర్ణయించింది. అసెంబ్లీ గేటు నుంచి ఉల్లిపాయ దండలతో అసెంబ్లీకి వచ్చి నిరసన తెలపాలని టిడిపి ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. రాజధాని పోలవరం, ఏపీ పేరుతో ప్రభుత్వ భూముల అమ్మకం పైనా ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. అలాగే భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, రైతు రుణమాఫీ, టిడిపి కార్యకర్తలు నాయకుల పై దాడులు కూడా అసెంబ్లీలో ప్రధానంగా ప్రస్తావించాలని టిడిఎల్పీ తీర్మాణించింది. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. మరి ఎలా జరుగనున్నాయి అనేది వేచి చూడాలి.