ఆ కీలక పోస్ట్ కు జగన్ ఎవరిని నియమించబోతున్నారు?

 

ఏపీలో ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు కావస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల్ని మార్చారు, కీలకమైన పోస్టుల్లో కొత్త వారిని నియమించారు. డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను తీసుకొచ్చారు. ఇతర ప్రాధాన్య పోస్టులలో కూడా కొత్తాధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఐపీఎస్ అధికారుల బదిలీలు ఇప్పటి వరకూ మూడు నాలుగు సార్లు జరిగాయి. కానీ ఒక పోస్టులో మాత్రం ఎవరినీ నియమించడం లేదు. ప్రభుత్వంలో కీలకమైన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మాత్రం ఇంకా ఎవరినీ నియమించలేదు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించాలని సీఎం జగన్ అనుకున్నారు. తెలంగాణ కేడర్ లో ఉన్న స్టీఫెన్ రవీంద్ర డిప్యూటేషన్ కు తెలంగాణ సర్కారు కూడా అనుమతినిచ్చింది.గౌరవం కోసం కేంద్రాన్ని కూడా జగన్ లేఖల మీద లేఖలు రాశారు. అయితే స్టీపెన్ డిప్యూటేషన్ కు కేంద్ర హోంశాఖ అంగీకారం తెలపలేదు. అప్పట్లో మూడు నెలలు సెలవు పెట్టిన స్టీఫెన్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేరిపోవటం అంతా ఖాయం అని అనుకున్నారు. కాని కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయన తిరిగి తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లో తనకు కేటాయించిన పోస్టులో చేరిపోయారు. 

స్టీఫెన్ రవీంద్ర రాకపోవడంతో నిఘా విభాగాధిపతిగా కీలకమైన పోస్టుకు పలువురి పేర్లను సీఎం జగన్ పరిశీలించినట్లు తెలుస్తోంది. రవాణా శాఖ కమిషనర్ గా ఉన్న ఆంజనేయలతో పాటు ఇతర ఐపీఎస్ అధికారుల బయోడేటాలూ జగన్ దగ్గరకే వెళ్లాయి. అయితే ఆయన మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ ఓకే చెప్పలేదు. ప్రభుత్వానికి చెవులు కళ్లుగా పని చేసే ఇంటెలిజెన్స్ విభాగానికి బాస్ ను జగన్ ఎందుకు నియమించడం లేదనేది సస్పెన్స్ గా మారింది. ఆరునెలలుగా ఈ పోస్ట్ కు సమర్థవంతమైన అధికారి దొరకడం లేదా లేక కావాలనే ఖాళీగా ఉంచుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. స్టీఫెన్ రవీంద్ర కోసం మళ్లీ కేంద్రస్థాయిలో మరోసారి ప్రయత్నాలు చేస్తారా అనేది వేచి చూడాలి.