తుఫాను: సీఎం తక్షణసాయం ప్రకటన

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హుదూద్ తుఫాను బాధితులకు తక్షణ సాయం ప్రకటించారు. సోమవారం సాయంత్రానికి బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చక్కెర, 5 లీటర్ల కిరోసిన్ పౌరసరఫరాల దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నట్టు చంద్రబాబు చెప్పారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, పరిస్థితిని సమీక్షించిన అనంతరం విశాఖ కలెక్టరేట్‌లో చంద్రబాబు మాట్లాడారు. తుఫాను కారణంగా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చంద్రబాబు ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు, పశువులు చనిపోతే 25 వేలు, మత్సకారుల వలలకు 5 వేలు, పడవ నష్టపోతే 10 వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. విశాఖ నగరంలో (నేడు) సోమవారం సాయంత్రంలోగా విద్యుత్తును పునరుద్ధరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గం స్థాయిలో పరిస్థితిని సమీక్షించాలని, సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ శ్రమిద్దామని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తనకు ఎంతో ఇష్టమైన విశాఖ నగరానికి ఇలా జరగడం తనకు ఎంతో బాధ కలిగిస్తోందని చంద్రబాబు అన్నారు.