పురోగతిలో వున్న ఏపీకి ప్యాకేజీ ప్రక్రియ

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. ఈ అంశం మీద కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి సమావేశమై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడంలో కొంత ఆలస్యం జరిగిందని సమావేశం అనంతరం అశోక్ గజపతిరాజు అన్నారు. త్వరలో ప్రత్యేక ప్యాకేజీ వచ్చే అవకాశం వుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఎంత నిధులు అవసరమనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా అంచనా వేయలేదని, ఆ అంచనాలు కేంద్రానికి అందిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా వుందని కేంద్ర మంత్రి సుజనా చౌదరి తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వేరు, ప్యాకేజీ వేరని ఆయన వివరణ ఇచ్చారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో మరోసారి సమావేశం అవుతామని మంత్రులు వెల్లడించారు.