పొలంలో విమానం.. కేసు నమోదు చేసిన పోలీసులు

 

రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం మోకిలలో శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణహాని జరగలేదు. ఢిల్లీకి చెందిన భరత్ భూషణ్ నగరంలోని బేగంపేట్ ఎయిర్ పోర్టులో రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. శిక్షణలో భాగంగా ఈరోజు ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టులో విమానంలో బయలు దేరాడు. అయితే మధ్యలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం ప్రమాదానికి గురైంది. చెట్టుకు తగిలి గ్రామంలోని శంకరమ్మ అనే మహిళా రైతు పొలంలో కుప్పకూలింది. పైలట్ భరత్ భూషణ్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని శంకర్ పల్లి బీఎన్ఆర్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విమానయాన శాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే కుప్పకూలిన విమానం శకలాలను ఫొటోలు తీసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఘటనాస్థలికి చేరుకున్నారు.