నేడు ఖమ్మంకు పవర్ స్టార్

 

పవన్ కళ్యాణ్ నేడు  తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి వెళ్ళనున్నారు. ఖమ్మంలో శ్రీజ అనే 13 సంవత్సరాల బాలిక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. ఆమె పవన్ కళ్యాణ్ అభిమాని. పవన్ కళ్యాణ్‌ని జీవితంలో ఒక్కసారైనా చూడాలన్నది ఆమె కోరిక. ఆ బాలిక ఆకాంక్షను తీర్చడం కోసం పవన్ కళ్యాణ్ ఖమ్మంలో ఆమె చికిత్స పొందుతున్న ఆస్పత్రికి శుక్రవారం నాడు వెళ్తున్నారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ సంస్థ సాధిక్ అనే తీవ్ర వ్యాధిగ్రస్త బాలుడి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అవ్వాలన్న కోరికను రెండు రోజుల క్రితం తీర్చింది. సాధిక్ ఒక్కరోజు పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈ సందర్భంగా మేక్ ఎ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ని కలవాలని అనుకుంటున్న బాలిక శ్రీజ గురించి ప్రస్తావించారు. ఆ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ శ్రీజని కలవటానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. నేడు ఖమ్మంలో ఆమెను కలుస్తారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన రాజమండ్రిలో ప్రకటించారు.