‘భక్త కన్నప్ప’ జేబుకి కన్నం...

 

‘రెబల్‌స్టార్’ కృష్ణంరాజు జేబు కొట్టేశారు. ఆ జేబులో వున్న పర్సును మాయం చేశారు. ఎవరింత పని చేశారు? ఇంకెవరూ... సాక్షాత్తూ జేబుదొంగలు. ఎప్పుడు? ఎక్కడ? బుధవారం నాడు, హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో! భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా బుధవారం నాడు హైదరాబాద్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనకు స్వాగతం పలకడానికి మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులందరితోపాటు కృష్ణంరాజు కూడా విమానాశ్రయానికి వెళ్ళారు. అక్కడ జనం తొక్కిడిలో ఏం జరిగిందోగానీ, ఆ తర్వాత చూసుకుంటే కృష్ణంరాజు జేబులో పర్సు మాత్రం కనిపించలేదు. కృష్ణంరాజు పర్సులో బోలెడన్ని క్రెడిట్ కార్డులతోపాటు కొంత నగదు కూడా వున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కృష్ణంరాజు జేబు కొట్టేసిన దొంగకి ఆయన ‘రెబల్‌స్టార్’ అనే విషయం తెలిసి వుండకపోవచ్చు... తెలిసి వుంటే ఆయన జోలికి వచ్చేవాడు కాదేమో! కృష్ణంరాజు గతంలో నటించిన ఒక సినిమాలో ఓ పాట వుంది... ‘‘ఉంగరం పడిపోయింది.. పోతేపోనీ...’’ అంటూ సాగుతుంది అ పాట. అయితే కృష్ణంరాజు మాత్రం ‘‘పర్సు పోయింది.. పోతేపోనీ’’ అనుకోకుండా విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.