10వేల దిశ‌గా కేసులు.. ఏపీలో క‌రోనా క‌ల్లోలం..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా క‌ల్లోలం రేపుతోంది. సెకండ్ వేవ్‌లో వైర‌స్ సోకిన వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. పాజిటివ్ కేసుల‌తో పాటు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండ‌టం మ‌రింత ఆందోళ‌న‌క‌రం. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 39,619 మందికి పరీక్షలు చేయ‌గా.. 9,716 పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 9,86,703 మంది వైరస్‌ బారినపడినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.  

ఒక్క రోజులోనే క‌రోనాతో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా పది మంది ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో ఏడుగురు.. తూర్పు గోదావరి, శ్రీకాకుళంలో నలుగురేసి.. చిత్తూరు, ప్రకాశంలో ముగ్గురు.. గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. అనంతపురంలో ఒక్కరు.. కరోనాతో చనిపోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,510కి చేరింది. 

24 గంటల వ్యవధిలో 3,359 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,18,985కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం ఏపీలో 60,208 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1,57,93,298 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. అత్యధికంగా శ్రీకాకుళంలో 1,444, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 106 కేసులు నమోదయ్యాయి.