తమిళనాడులో పేలిన బాయిలర్.. ఆరుగురి మృతి

తమిళనాడులోని కడలూరు జిల్లా ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ థర్మల్ ప్లాంట్‌లో బుధవారం బాయిలర్ పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. అందుతున్న సమాచార ప్రకారం థర్మల్ పవర్ స్టేషన్-2 లోని ఐదవ యూనిట్‌లో పేలుడు చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉదయం షిఫ్ట్ లో కార్మికులు పని ప్రారంభిస్తున్న సమయంలో ఈ పేలుడు జరిగిందని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 17 మంది గాయపడినట్టు కడలూరు ఎస్పీ అభినవ్ తెలిపారు. మరి కొంత మంది కార్మికులు లోపల చిక్కుకుపోయినట్టుగా చెబుతున్నారు. గాయపడినవారిని చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఐతే ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.