వద్దంటే టెన్త్ ఎగ్జామ్స్ పెట్టారు.. స్టూడెంట్స్ ను కరోనా చుట్టేసింది

భారత్ లో కరోనా తీవ్రత దృష్ట్యా మార్చ్ నెలలోనే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఐతే అదే సమయంలో పలు రాష్ట్రాలలో స్టార్ట్ కావాల్సిన టెన్త్ ఎగ్జామ్స్ కూడా వాయిదా పడ్డాయి. ఐతే ఒకసారి లాక్ డౌన్ సడలింపులు వచ్చిన తరువాత పంజాబ్ వంటి కొన్ని రాష్ట్రాలు పరీక్షలు జరపకుండానే గ్రేడ్ లు ఇచ్చి రిజల్ట్స్ ప్రకటించాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ఏమైనా సరే ఎగ్జామ్స్ జరిపి తీరాలని తీవ్రంగా ప్రయత్నించినా తెలంగాణాలో హైకోర్టు జోక్యం తో పరీక్షలు జరపకుండానే గ్రేడ్లు ఇచ్చి రిజల్ట్స్ ప్రకటించారు.

ఐతే ఊరందరిది ఒక దారైతే ఉలిపి కట్టె ది ఇంకో దారి అన్నట్లుగా కర్ణాటక ప్రభుత్వం మాత్రం ప్రజలు ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా పరీక్షలు రాయాల్సిందే అని పట్టు బట్టి మరీ పరీక్షలు నిర్వహించారు. మొన్న జూన్ 25 నుండి జులై 3 వరకు ఎగ్జామ్స్ జరిగాయి. మొత్తం 7,61,506 మంది ఈ ఎగ్జామ్స్ రాసారు. ఇపుడు ఈ ఎగ్జామ్స్ రాసిన వారిలో 32 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ ఐంది. దీంతో ఆ విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారు.

ఇది ఇలా ఉండగా మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జులై 3 తో చివరి ఎగ్జామ్ పూర్తయింది కాబట్టి ఆ రోజు నుండి 14 రోజులు వరకు అంటే జులై 17 వరకూ విద్యార్థులకు ఎప్పుడైనా కరోనా లక్షణాలు బయటపడే అవకాశం ఉంటుంది. ఐతే పరీక్షలు జరిగిన 9 రోజుల్లోనే 32 మందికి కరోనా సోకిందంటే, ఈ ఎగ్జామ్డ్ టైం లో ఇంకా ఎంతమందికి అది సోకిందో అని ప్రజలు ఆందోళన లో ఉన్నారు. ప్రస్తుతం ఈ 32 మందికి తోడు మరో 80 మంది విద్యార్థుల్ని ప్రైమరీ కాంటాక్ట్స్‌ కింద ప్రభుత్వం ఇళ్లలోనే క్వారంటైన్ చేసింది. అయినా ప్రపంచం మొత్తం కరోనా కు భయపడి తమ కార్యకలాపాలు తగ్గించుకుంటూ ఉంటె కర్ణాటక వంటి ప్రభుత్వాలు మాత్రం మొండిగా వ్యవహరించడం ఇటు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది.