పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
posted on Jul 3, 2013 3:14PM
పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మధ్యాహ్నం ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) రమాకాంత్ రెడ్డి షెడ్యూల్ను విడుదల చేశారు. మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నట్లు ఆయన తెలిపారు. బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరుగనుంది. 23న తొలి విడత ఎన్నికలు, 27న రెండో విడత ఎన్నికలు, 31న మూడో విడత ఎన్నికలు జరుగనున్నాయి. రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఈనెల 9న జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. జులై 9 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 13న నామినేషన్లకు చివరి తేది. ఈనెల 14న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది జులై 17. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా నేటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావలి(ఎన్నికల కోడ్) అమలులోకి వచ్చిందని రమాకాంత్రెడ్డి తెలిపారు.