600కోట్లతో సినిమా చూపించిన 'సిమ్స్' సంస్థ
posted on Feb 16, 2013 3:29PM
త్రివిక్రమ్ 'జులాయి' సినిమాలో ప్రజల దగ్గర నుంచి 1500కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేస్తాడు విలన్. చివరికి ఆ డబ్బును హీరో ప్రజలు వద్దకు చేరుస్తాడు. ఆ సినిమాను చూసి ఇన్స్ స్పైర్ అయ్యారో లేదో తెలియదు కాని వైజాగ్ లో సేమ్ సీన్ రీపీట్ అయ్యింది. లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు పది వేల రూపాయలు వడ్డీ ఇస్తామని ఆశ చూపి ప్రజల నుంచి 600 కోట్ల రూపాయలకుపైగా వసూలు చేసి సిమ్స్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. అధిక వడ్డీ చెల్లించడంతో మధ్య తరగతి ప్రజలు ఎగబడి తమ వద్ద ఉన్న సొమ్ముని ఈ సంస్థలో దాచుకున్నారు. ఇప్పుడు ఆ సంస్థ యజమానులు పత్తాలేరు.
అనకాపల్లి, యలమంచిలిలలోని ఈ సంస్థ కార్యాలయాలపై డిపాజిట్దారులు దాడి చేశారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. డిపాజిట్ చేసివారి వత్తడితో అనకాపల్లిలో ఈ సంస్థ ఏజెంట్ సత్తిబాబు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చోడవరంలో సిమ్స్ కార్యాలయం వద్ద డిపాజిట్దారులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా, సంస్థ యజమాని సురేంద్ర గుప్త పోలీస్ ఉన్నతాధికారుల వద్ద లొంగిపోతారని చెబుతున్నారు. భాదితులకు న్యాయం చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. మరీ ఈ పేద ప్రజలకు ఏ హీరో న్యాయం చేస్తాడో వేచి చూడాలి.