తెలంగాణా ఫై జగన్ దారెటు ?

 


ఈ నెల 28 న ఢిల్లీ లో తెలంగాణా ఫై అఖిల పక్ష సమావేశం జరగనున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొనే నిర్ణయం ఫై అంతటా ఉత్కంట నెలకొని ఉంది. తెలంగాణా ఫై ఏదో ఒక నిర్ణయం తేల్చి చెప్పాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఆ పార్టీకి తలెత్తింది.


తమ పార్టీ తెలంగాణా ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తుందని, ప్రత్యెక రాష్ట్రాన్ని అడ్డుకోదని, ఆ పార్టీ నేతలు ఇంత కాలం చెపుతూ వచ్చారు. ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని కూడా వారన్నారు. అయితే, తమ పార్టీకి తెలంగాణా విషయంలో ఓ స్పష్టమైన వైఖరి ఉందని ఈ పార్టీకి చెందిన తెలంగాణా నేతలు అంటున్నారు. సీమంధ్ర నేతలు మాత్రం ఈ విషయంలో స్పష్టంగా ఓ ప్రకటన చేయలేకపోతున్నారు.


అఖిల పక్ష భేటీలో తమ పార్టీ ఓ స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడిస్తుందని, ఆ పార్టీ ఎంఎల్ఏ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆ నిర్ణయాన్ని ఇప్పుడే చెప్పాల్సిన పని లేదని కూడా ఆయన అన్నారు. కేంద్రమే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాను ఇచ్చేదీ, తెచ్చేదీ కాదని ఆయన అన్నారు. ఈ రోజు జరగనున్న పార్టీ సమావేశంలో ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.