విభజనపై ఎంవీవీఎస్ ఘాటు వ్యాఖ్యలు
posted on Aug 12, 2013 11:55AM
టిడిపి మాజీ ఎంపీ, సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి సాధారణంగా సౌమ్యంగా ఉంటారు. అలాంటి నేత విభజనపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం విడిపోవాలంటే అసెంబ్లీ తీర్మానం తప్పనిసరని ఆయన అన్నారు. అది లేకుండా చేస్తే మాత్రం రక్తపాతమేనని ఆయన హెచ్చరిస్తున్నారు.
రాష్ట్ర విభజనపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, అయితే హైదరాబాద్ భవిష్యత్తు, రాష్ట్ర విభజనకు అనుసరించాల్సిన విధివిధానాలు, ఆర్థికపరమైన అంశాలపై తెలుగుదేశం పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని, ఇక చంద్రబాబు నోరు విప్పే సమయం ఆసన్నమైందని మూర్తి అన్నారు.
అధికార దాహంతో, రాజకీయ స్వార్థంతో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అత్యుత్సాహం చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నందున ఆంధ్రప్రదేశ్ను విభజించే హక్కు, అర్హత కాంగ్రెస్ పార్టీకి లేవని ఆయన చెప్పారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని ఆయన అభినందించారు.