కాంగ్రెస్ ‘సర్వే’నాశనం

 

అటు దేశంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్వనాశనం అయిపోయిందన్న విషయం స్పష్టంగా తెలిసిపోతూనే వుంది. పార్లమెంట్ విషయంలో ఎవర్ని కదిలించినా ‘మోడీ’ అంటున్నారు. సీమాంధ్రలో ఎవర్ని అడిగినా ‘చంద్రబాబు’ అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం నిశ్శబ్ద విప్లవం సృష్టించబోతోందన్న అభిప్రాయాలు రాజకీయ పరిశీలకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇదిలా వుంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయ్యే అవకాశాలున్నాయని జాతీయ స్థాయిలో పలు ఛానెళ్ళు సర్వే సంస్థలతో కలసి నిర్వహించిన సర్వేల్లో తెలిసిపోతోంది. రెండు మూడు మీడియా సంస్థలు బయటకి వెల్లడించిన సర్వే ఫలితాలను గమనిస్తే కాంగ్రెస్ నాయకులు ఎన్నికల తర్వాత నెత్తిన తెల్లగుడ్డలు వేసుకోవడం ఖాయమని అర్థమవుతోంది.

 

మరికొన్ని మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల ఫలితాలు త్వరలో బయటకు రానున్నట్టు తెలుస్తోంది. ఈ సర్వేలన్నీ కూడా దేశంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ మటాషైపోవడం ఖాయమని చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం వాస్తవాలను ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. అన్ని సర్వేలూ తమకి వ్యతిరేకంగా వస్తున్నప్పటికి వాళ్ళకి జ్ఞానోదయం కలగటం లేదు. ఇవన్నీ డబ్బులిచ్చి చేయిస్తున్న సర్వేలంటూ గత ఎన్నికల సమయంలో తాము చేయించిన ‘పెయిడ్ సర్వే’లను గుర్తు చేసుకుంటూ చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి గతి పట్టబోతోందో తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా సర్వేలు చేయాల్సిన అవసరం లేదని, మారుమూల పల్లెటూళ్ళో వున్న సామాన్య ఓటర్ని అడిగినా చెబుతాడని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.