కరీంనగర్‌లో సోనియాగాంధీ కళ్ళు తిరగాలి

 

 

 

బుధవారం సాయంత్రం కరీంనగర్‌లో జరగబోతున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగసభలో సోనియాగాంధీకి కళ్ళు తిరిగేలా చేయాలని టీ కాంగ్రెస్ నాయకులు గట్టి పట్టుదల మీద వున్నట్టు సమాచారం. సోనియా కళ్ళు తిరగడం అంటే, సభకు హాజరైన జనాన్ని చూసి సోనియాగాంధీ ఆశ్చర్యపోవడంతోపాటు ఆనందించాలన్నది టీ కాంగ్రెస్ నాయకుల అసలు ఉద్దేశం.

 

ఢిల్లీలో కూర్చున్న సోనియా తాను అడ్డదారిలో తెలంగాణ ఇచ్చేయడం వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలు తనను దేవతలా భావిస్తున్నారని భావిస్తున్నారు. అలాంటి సోనియాగాంధీ తన బహిరంగ సభలో జనం తక్కువగా కనిపిస్తే హర్టయి, టీ కాంగ్రెస్ నేతలకు క్లాసు పీకే అవకాశం వుంది కాబట్టి టీ కాంగ్రెస్ నాయకులు  సభ నిండుగా వుండేలా సకల చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.



కరీంనగర్ పరిసర ప్రాంతాల నుంచి భారీగా జనసమీకరణ చేయాలని నిర్ణయించిన టీ కాంగ్రెస్ నేతలు దానికోసం ఎవరి వంతు కృషి వారు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా నుంచి మాత్రమే కాకుండా, కరీంనగర్‌కి సమీపంలో వున్న ఇతర తెలంగాణ జిల్లాల నుంచి కూడా జనాన్ని భారీగా సమీకరించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.