'రాయల తెలంగాణ' వెనుక కాంగ్రెస్ తంత్రం!
posted on Jul 2, 2013 3:21PM
ఆంద్రప్రదేశ్ కాంగ్రేస్ పార్టీకి అత్యంత కీలక రాష్ట్రం అనేది అందరికి తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమంతో కెసిఆర్, ఇటు వైసీపీ ఆవిర్భావంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి క్లిష్టంగా మారింది. దీంతో తెలంగాణ సమస్యను పరిష్కరించడానికి 'రాయల తెలంగాణ' ప్రతిపాదనను కాంగ్రెసు అధిష్టానం ముందుకు తెచ్చింది. ఇదే సమయంలో తన రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఆ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు.
రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి, మరోమాటలో చెప్పాలంటే ఆయన బలాన్ని చీల్చడానికి రాయల తెలంగాణ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు భావిస్తున్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు అంగీకరించడంలో మజ్లీస్ ప్రయోజనాలు కూడా రాజకీయపరమైనవే. ఇటు కాంగ్రెసు ఆ ప్రతిపాదనను ముందుకు తేవడంలో, మజ్లీస్ దానికి పచ్చజెండా ఊపడంలో కూడా రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయి తప్ప తెలుగు ప్రజల ప్రయోజనాలు అందులో ఇమిడి లేవనే విషయం తెలుస్తోంది.
సీమాంధ్రలో రెడ్డి వర్గం బలహీనపడి సామాజిక సమీకరణలు మారిపోతాయని, ప్రధాన పోటీ కాపు, కమ్మ వర్గాల మధ్యే ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. కొత్తగా ఏర్పడే సమీకరణల్లో చిరంజీవి, బొత్స సత్యనారాయణ మొదలైన నేతలు బలోపేతమవుతారని, వీరు ఇతర వర్గాలను సమీకరించడంలో విజయం సాధించగలరని కాంగ్రెస్ విశ్వసిస్తోంది.