కేసీఆర్ మీద పొన్నాల ఫైర్!

 

 

 

టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మీద తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఫైర్ అయ్యాడు. కేసీఆర్ నిన్న మెదక్ జిల్లాలో జరిగిన ఎన్నిక ప్రచార సభలో కాంగ్రెస్ పార్టీని తిట్టిపోశాడు. దానికి కౌంటర్‌గా పొన్నాల స్పందించాడు. కాంగ్రెస్ పాలనలో ఆంధ్రప్రదేశ్ బోలెడంత అభివృద్ధి చెందిందని, కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదంటూ దుష్ప్రచారం చేస్తున్నాడని విమర్శించాడు.

 

వంద సంవత్సరాలకు పైబడిన కాంగ్రెస్ పార్టీని తెరాస లాంటి చిన్నా చితక పార్టీలు ఏమీ చేయలేవని ఆయన అన్నారు. మాట తప్పే వ్యక్తి కేసీఆర్ అని, ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ అని పొన్నాల అన్నాడు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్టుగా మాటమీద నిలబడలేని వ్యక్తి తెలంగాణని అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడని దుయ్యబట్టాడు.



ఇన్నేళ్ళుగా రాజకీయాల్లో వున్న కేసీఆర్ మెదక్ జిల్లా కోసం ఏం చేశాడో చెప్పాలని నిలదీశాడు. అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని నొక్కి వక్కాణించాడు. కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడుతున్న ప్రధాన వ్యక్తి అంటూ, చరిత్రలో కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడిగా మిగిలిపోతాడని శాపనార్థాలు పెట్టాడు.