కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు ఎలక్షన్ సందేశం

 

 

 

కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఆయన తన మాతృమూర్తి, కొడుకు విష్ణుతో కలసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్షన్ కింగ్ ఎలక్షన్ సందేశం ఇచ్చారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని సినీ నటుడు మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.

 

వైఎస్సార్ కుటుంబంతో వియ్యం అందుకున్న ఆయనకి చంద్రబాబుతో కూడా వ్యక్తిగత విభేదాలున్నాయి. అందుకే జగన్, చంద్రబాబు పేర్లు చెప్పకుండా ‘యువత’ అనే మాట వాడి జగన్‌కే ఓటు వేయండని చెప్పకనే చెప్పారు.  యువత చేతిలోనే  భవిష్యత్తు ఉందని... అభివృద్ధి చేసే వారికే ఓటు వేయాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ధన ప్రవాహానికి అంతులేకుండా పోయిందన్నారు. ఇదంతా ప్రజల సొమ్మే అని చెప్పారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టి ప్రజలకే పంచుతున్నారని ఆరోపించారు.



రాజకీయ నాయకులు చేసే వాగ్ధానాలు హద్దు మీరాయని, అమలు సాధ్యం కాని వాగ్దానాలను చేస్తూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మోహన్‌బాబు చెబుతున్నప్పుడు ఆయన జగన్‌కి అనుకూలంగా, జగన్ మాట్లాడిన మాటలే మాట్లాడుతున్నట్టు అర్థమైపోయింది. కొత్త రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయని తెలిపారు. ఓటర్లంతా ఆత్మవంచన చేసుకోకుండా, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని కలెక్షన్ కింగ్ ఎలక్షన్ సందేశం ఇచ్చారు.