'పెప్పర్ స్టార్' లగడపాటి
posted on Feb 13, 2014 7:55PM
డ్రామా కింగ్ అని పేరుపొందిన కాంగ్రెస్ బహిష్కృత యంపీ లగడపాటి రాజగోపాల్ ఇంతకాలంగా రాష్ట్ర విభజన విషయంలో ఎంతగా గొంతు చించుకొన్నా, ఎక్కడ, ఎన్ని డ్రామాలు ఆడినా రాని గుర్తింపు, ఈ ఒక్క రోజులోనే సంపాదించుకొన్నారు. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు, జాతీయ మీడియాలో ఆయన చేసిన పని గురించే చర్చ జరగడంతో ఒకే ఒక్కరోజులో ఆయన పెద్ద ‘స్టార్ అట్రాక్షన్’గా మారిపోయారు. చివరికి ఆయన రాజకీయ ప్రత్యర్ధి జగన్ మోహన్ రెడ్డి సైతం లగడపాటి మంచిపనే చేసారని మెచ్చుకొన్నారు. ఇంతకీ ఆయన చేసిన ఘన కార్యం ఏమిటంటే ,ఈరోజు లోక్ సభలో తెలంగాణా కాంగ్రెస్ యంపీలను అడ్డుకొనేందుకు ఆయన వారిపై మిరియాల పొడి స్ప్రే చేయడమే. దానితో సభలో అందరూ ఉలిక్కిపడి భయంతో బయటకి పరుగులు తీయవలసి వచ్చింది. భాద్యతగల ఒక సభ్యుడిగా ఆయన ఆవిధంగా చేయడం ఎవరూ హర్షించరు. అందుకు ఆయనపై కేసులు పెట్టవచ్చును. తప్పనిసరి అయితే నిర్భందించవచ్చును కూడా. కానీ దానివల్ల ఆయనకు సీమాంధ్ర ప్రజలలో మరింత సానుభూతి పెరిగి మేలు చేస్తుందే తప్ప ఎటువంటి నష్టము లేదు. పైగా ఆయనకీ మరింత ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతునందుకు చాలా సంతోషిస్తారేమో కూడా!