75 అసెంబ్లీ, 15 ఎం పి సీట్లు మావే : కే సి ఆర్

 

 

 

 

 

 

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ 75 అసెంబ్లీ, 15 ఎం పి సీట్లు సాధిస్తుందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే.చంద్ర శేఖర రావు ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ రోజు రోజుకు బలం పుంజుకుంటోందని ఆయన అన్నారు. అలాగే, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింతగా శ్రమిస్తే, మరో 25 స్థానాల్లో గెలుపు తమదేనని ఆయన అన్నారు.

 

వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్దం చేసే పనిని కే సి ఆర్ అప్పుడే ప్రారంభించారు. ప్రతి రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక్కరి చొప్పున పార్టీ సమన్వయకర్తలను నియమించిన కే సి ఆర్ వారితో నిన్న హైదరాబాద్లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని తెలంగాణా భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర డివిజన్ల ఇన్‌చార్జిలు కూడా పాల్గొన్నారు. అట్టడుగు స్థాయి నుండి పార్టీని పటిష్టం చేయాలని, స్థానిక సంస్థలు, సహకార ఎన్నికల్లోనూ విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశానికి హాజరు కాని పార్టీ నాయకులఫై కే సి ఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

 

ఒక వైపు తెలంగాణా విషయంలో ఢిల్లీ లో అతి త్వరలో అఖిల పక్ష సమావేశం జరగనున్న తరుణంలో, ఆ అంశం కాకుండా, పార్టీని అన్ని రకాల ఎన్నికలకు సిద్దంచేసే పనిలో కే సి ఆర్ ఉన్నారు.