జోబైడెన్ టీమ్ లో కరీంనగర్ యువకుడు! పోతిరెడ్డిపేట ప్రజల సంబరాలు 

అమెరికా నూతన అధ్యక్షుడు జోబైడెన్ టీమ్ లో తెలంగాణ యువకుడికి చోటు దక్కింది.  వైట్ హౌజ్ స్పీచ్ రైటింగ్ డైరెక్టర్ గా కరీంనగర్ జిల్లాకు చెందిన చొల్లేటి వినయ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి 1970లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీ చేసేందుకు అమెరికా వెళ్లి ఆక్కడే స్థిర పడ్డారు. నారాయణరెడ్డి ముగ్గురు కొడుకుల్లో వినయ్ రెడ్డి ఒకరు. అమెరికాలో లా కంప్లీట్ చేసిన వినయ్ రెడ్డి మొదట యూఎస్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ కు స్పీచ్ రైటర్‌గా పని చేశారు. 

2012 అమెరికా ఎన్నికల సమయంలో అప్పటి డెమెక్రటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి  బరాక్ ఒబామాకు, బైడెన్లకు స్పీచ్ రైటర్ గా వ్యవహరించారు వినయ్ రెడ్డి. తాజా ఎన్నికల్లో బైడైన్, కమలా హారిస్ లకు స్పీచ్ రైటర్ తో పాటు ట్రాన్స్‌లేటర్‌గా కూడా పని చేశారు. వినయ్ రెడ్డి పనితీరు బాగుండటంతో ఇప్పుడు వైట్ హౌజ్ డైరెక్టర్ గా  అతన్ని అపాయింట్మెంట్ చేశారు జోబైడెన్. తమిళనాడు సంతతికి చెందిన కమలా హారీస్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాగా ఆమెతో పాటు, ప్రెసిడెంట్ జో బైడెన్ లకు స్పీచ్ రైటర్ కం ట్రాన్స్‌లేటర్ గా వ్యవహరించారు వినయ్ రెడ్డి.

1970లో అమెరికాకు వెళ్ళిన నారాయణరెడ్డి  స్వగ్రామమైన పోతిరెడ్డిపేటలో ఆస్థులను మాత్రం విక్రయించలేదు. 3 ఎకరాల వ్యవసాయ భూమిని, ఇళ్లు ఆయన పేరిటే ఉన్నాయి. వీలు చిక్కినప్పుడల్లా నారాయణరెడ్డి గ్రామానికి వచ్చి, ఆ గ్రామంతో ఉన్న అనుబంధాన్ని, చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటుంటారు. పోతిరెడ్డిపేటలో చేపట్టిన పలు కార్యక్రమాలకు ఆర్ధిక సాయం అందించి సేవాగుణాన్ని చాటుకున్నారు. వినయ్ రెడ్డి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు స్పీచ్ రైటర్ గా వ్యవహరిస్తుండటంతో పోతిరెడ్డిపేట ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. వినయ్ రెడ్డి వల్ల తమ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.