జగనొచ్చాడు బాబోయ్!

 

 

 

జగన్ చదువుకునేటప్పుడు అన్ని పరీక్షలూ కాపీకొట్టే పాసైన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ కాపీకొట్టే గుణాన్ని జగన్ రాజకీయాల్లో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఏ పని చేస్తే అదేపని, అదే తరహాలో చేసేస్తున్నాడు. బాబు దీక్షచేస్తే జగన్ దీక్ష చేశాడు. బాబు ఢిల్లీ వెళ్ళొచ్చాడని ఇప్పుడు జగన్ కూడా ఢిల్లీ వెళ్ళాడు.

 

రాష్ట్ర విభజన జరక్కుండా చూడాలని పలువురు జాతీయ నేతలను కలసి బతిమాలడం జగన్ పర్యటనలో పైకి చెబుతున్న ఎజెండా. అయితే జగన్ జాతీయ నేతలను కలవాలని ఉత్సాహం చూపిస్తున్నాడు. అయితే జగన్‌ని కలవటానికి మాత్రం జాతీయ నేతలు ఆసక్తి కనబరచడం లేదు. లక్షల కోట్ల అవినీతి ఆరోపణలలో కొట్టుమిట్టాడుతూ, పదహారు నెలలపాటు జైల్లో వుండొచ్చిన జగన్‌తో మాట్లాడ్డానికి కూడా అనేకమంది జాతీయ నాయకులు ఇష్టపడటం లేదు. వాళ్ళంతా జగనొచ్చాడు బాబోయ్ అనుకుంటున్నారు.



పైకి సమైక్యవాదినని చెప్పుకుంటున్నప్పటికీ, సోనియాకీ, జగన్‌కి మధ్య రహస్య ఒప్పందాలు జరిగిన విషయం తేటతెల్లమైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోనియాకి నమ్మినబంటు లాంటి జగన్‌ని కలవటం ఎందుకన్న అభిప్రాయం జాతీయ నాయకులలో కలిగింది. అయితే కలవటానికి వచ్చినవాడిని వద్దు పొమ్మనడం బాగోదన్న ఉద్దేశంతోనే తటపటాయిస్తున్నారు.  జగన్ తమను కలవటానికి వచ్చినా, ఏదో మాటవరసకి పలకరించడమే తప్ప అతనిని సీరియస్‌గా తీసుకోకూడదని జాతీయ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.



జగన్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు గతంలో కలసిన నాయకులందర్నీ కలవటంతోపాటు మరికొంతమంది నాయకులను కూడా కలసి తన ‘సంఖ్యాబలం’ పెంచుకునే ఉద్దేశంలో వున్నట్టుంది. అయితే ఢిల్లీ పర్యటనలో చంద్రబాబుకు లభించినంత ప్రాధాన్యం జగన్‌కి లభించకపోవచ్చునని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా పరీక్షల్లో కాపీకొట్టి పాసవ్వొచ్చేమోగానీ, రాజకీయాల్లో కాపీకొడితే ఫెయిలవటం ఖాయమని జగన్‌కి జ్ఞానోదయం  కలిగేలా చెప్పేదెవరు?