జగన్ తీరుపై నేతల అసంతృప్తి...
posted on Oct 11, 2017 4:01PM
ఈ మధ్య జగన్ వైఖరి పార్టీ నేతలకు కూడా అంతంగా నచ్చనట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ పార్టీ పలువురు నేతలు అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీ చేరారు. ఇప్పుడు తాజాగా జగన్ వైఖరి నచ్చక పార్టీ మారే ఆలోచనలో పడుతున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా రంప చోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పార్టీ మారే యోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. జగన్ తీరు సరిగా లేకపోవడం.. జగన్ అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడమే దీనికి కారణం. ఇప్పుడు మరో నేత కూడా జగన్ తీరు వల్ల అసంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నేత అనుకుంటున్నారా..? ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ ఇంచార్జి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. దర్శి నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో పోటీ చేసిన శివప్రసాద్ మంత్రి శిద్ధా రాఘవరావు చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఇన్నాళ్లు ఇంచార్జిగా పార్టీని నడిపిన ఆయన వచ్చే ఎన్నికలలో మాత్రం పోటీకి నిరాసకత్తత చూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ అధినేత జగన్ తనను పట్టించుకోకపోవడమేనని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం గమనార్హం.
పోటీ విషయంలో తన వైఖరి చెప్పేందుకు జగన్ను కలిసిన సందర్భంలో ఆయన కనీసం అనునయించలేదని… సరేలే అన్నట్లుగా మాట్లాడారని.. అది తనను మరింత బాధించిందని… మూడున్నరేళ్లు పార్టీని నియోజకవర్గంలో నిలబెట్టినందుకు నాకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన కార్యకర్తలను నిలదీశారని సమాచారం. మరి జగన్ ఇప్పటికైనా తన వైఖరి మార్చుకుంటాడా..? లేక తన పని తాను చేసుకుంటూ పోతాడా చూద్దాం.