వడ దెబ్బకు ఇంటర్ విద్యార్ధి మృతి
posted on May 24, 2013 10:50AM
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసి వస్తుండగా విద్యార్ధి వడదెబ్బతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కధనం ప్రకారం జిల్లా కేంద్రానికి చెందిన రాకేష్ రెడ్డి (18) వరంగల్లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. అక్కడే సప్లిమెంటరీ పరీక్ష రాసి బస్సులో స్వగ్రామానికి బయల్దేరాడు. ఎండ వేడి ఎంత దెబ్బ తీసిందో ఏమో.. ఊరు దాకా రాకముందే బస్సులో స్పృహ కోల్పోయాడు. వడదెబ్బ తాకిడికి ప్రాణాలు ఎప్పుడుపోయాయో తెలియదుగానీ.. కోతిరాంపూర్లో దిగాల్సినవాడు దిగనే లేదు. కరీంనగర్ బస్టాండుకు వచ్చాక కూడా అలాగే ఆఖరుసీటులో పడి ఉండటంతో తోటి ప్రయాణికులు డ్రైవర్కు విషయం చెప్పారు. ముఖంపై నీళ్లు చల్లినా కదలకపోవడంతో 108కు సమాచారం అందించారు. వచ్చి చూసిన వైద్య సిబ్బంది.. అతడు మృతి చెందినట్లు చెప్పారు.