భార్యతో కలసి ఓటేసిన భారతీయ తొలి ఓటర్
posted on May 7, 2014 5:26PM
భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పోలింగ్లో తొలిసారి ఓటు వేసిన వ్యక్తిగా తన పేరు నమోదు చేసుకున్న శ్యామ్ శరణ్ నేత తాజా ఎన్నికల సందర్భంగా కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆయన వయసు 97 సంవత్సరాలు. శ్యామ్ శరణ్ నేగి హిమాచల్ ప్రదేశంలో ఒక మారుమూల గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. 1952లో దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 1952లో ఓటింగ్ జరిగే సమయంలో హిమాచల్ ప్రదేశ్లో మంచు బాగా పేరుకుని వుంటుంది. కాబట్టి అక్కడ మాత్రం 1951 అక్టోబర్లోనే ఎన్నికలు నిర్వహించారు. అప్పుడు తొలి ఓటరుగా నేగి గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేగి ఎంతో ఉత్సాహంతా ఓటు వేస్తూనే వస్తున్నారు. ఈ ఎన్నికలలో కూడా ఆయన తన భార్య హీరాతో కలసి ఓటు వేశారు. 97 ఏళ్ళ వయసున్న తాను ఇప్పటికీ ఉత్సాహంగా ఓటు హక్కుని వినియోగించుకుంటూ వుంటానని, మరి మన దేశంలో కొంతమంది యువత ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో ఎందుకు బద్ధకంగా వ్యవహిస్తారో తనకు అర్థం కాని విషయమని ఆయన వాపోతూ వుంటారు.