దుర్గాబాయిని ఓడించిన రాజమండ్రి !

 

 

 

1952లో జరిగిన తొలి ఎన్నికల్లో రాజమండ్రి ద్విసభ్య సాధారణ లోక్‌సభ స్థానం నుంచి విలక్షణ తీర్పు నమోదైంది. ఈ స్థానం నుంచి సోషలిస్టు పార్టీ అభ్యర్ధి ఎన్.రెడ్డి నాయుడు కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఆయన చేతిలో ఓటమి పాలైనది మరెవరో కాదు... ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు దుర్గాబాయి దేశముఖ్ ! అలాగే రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషించిన కళా వెంకటరావు కూడా ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన అమలాపురం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఘోరపరాజయం పాలయ్యారు. పోలైన ఓట్లలో ఆయనకు 12.5 శాతం మాత్రమే వచ్చాయి.

 

రాజమండ్రి నుంచి పోటీచేసిన సోషలిస్టు నేత, స్వాతంత్య్ర సమరయోధులు మద్దూరి అన్నపూర్ణయ్య కూడా కమ్యూనిస్టు అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. అంతేకాక మూడోస్థానంలో నిలిచారు. అలాగే రామచంద్రపురం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మల్లిపూడి పళ్లంరాజు ( కేంద్రమంత్రి పళ్లంరాజు తాత) ప్రజాపార్టీ అభ్యర్థి చేతిలో ఓడారు. ఆశ్చర్యం ఏమిటంటే స్వాతంత్య్రం తెచ్చానని ప్రచారం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ తొలి ఎన్నికల్లో మూడు లోక్‌సభ స్థానాల్లోనూ ఓటమి పాలైంది.