చంద్రబాబుకు తప్పిన ప్రమాదం..కాలికి గాయం
posted on Feb 14, 2013 2:54PM
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గుంటూరు పాదయాత్రలో కొలకలూరు గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మెట్ల నుండి దిగుతున్న సమయంలో వేదిక కోసం ఏర్పాటు చేసిన మెట్లు కూలిపోయాయి. వెంటనే భద్రత సిబ్బంది స్పందించి ఆయనను కింద పడకుండా పట్టుకున్నారు. దీంతో ఆయనకి ప్రమాదం తప్పింది. సమయానికి స్పందించిన భద్రత సిబ్బంది పై అందరూ పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబుకు ప్రమాదం తప్పిందన్న విషయం తెలియగానే ఆయన కుమారుడు లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ ఫోన్లు చేసి ఆరోగ్యం, ప్రమాదంపై వాకబు చేశారు.
బాబు తూలిపడ్డారని తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాబు కాలికి స్వల్ప గాయం మినహా ఎలాంటి ప్రమాదం జరగలేదని, టిడిపి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ రోజు పాదయాత్రను నిలిపివేసే అవకాశం ఉంది.