రాయలసీమ గ్యాంగ్ రేప్ అన్న బైరెడ్డి

 

 

రాజకీయ నాయకుల చేతుల్లో రాయలసీమ ప్రాంతం గ్యాంగ్ రేప్ కు గురయిందని ప్రత్యెక రాయలసీమ రాష్ట్రం కోసం తెలుగు దేశం పార్టీ నుండి బయటకు వచ్చిన బైరెడ్డి రాజ శేఖర రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ లు రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతున్నా, నోరు మెదపడం లేదని ఆరోపించారు.

 

తెలంగాణా ఇప్పటికే నిర్ణయం అయిపోయిన అంశమని బైరెడ్డి అన్నారు. తమ ప్రాంత పార్లమెంట్ సభ్యులు, అసెంబ్లీ సభ్యులు ఎన్నిక కావడం వరకే రాయలసీమను ఉపయోగించుకొంటారని, దోచుకునేందుకు మాత్రం సమైక్యాంధ్ర కావాలని కోరుతుంటారని దుయ్యబట్టారు. రాయలసీమ భూభాగం కొంచేమేమని, ఆంధ్ర ప్రదేశ్ అయితే ఎక్కువ భూభాగం కలిగిఉంటుంది కాబట్టి దోచుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని తమ నేతలు భావిస్తున్నారని బైరెడ్డి అన్నారు.

 

ఎన్నికల్లో సీమను వాడుకొంటున్న వారు అసలు సీమ నేతలేనా అని ఆయన ప్రశ్నించారు. తమ ప్రాంతంఫై అభిమానం లేనందుకు సిగ్గుపడాలని ఆయన సీమ నేతలకు హితబోధ చేశారు.