జాతీయ ఉపాధ్యక్షుడిగా దత్తాత్రేయ
posted on May 20, 2013 2:16PM
సికింద్రాబాద్ ఎంపీగా, కేంద్ర మంత్రిగా భారతీయ జనతా పార్టీలో మాజీ మంత్రి బండారు దత్తాత్రేయది కీలక పాత్ర. బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగిన దత్తాత్రేయ సికింద్రాబాద్ ఎంపీగా రెండు సార్లు గెలిచారు. నమ్మిన సిద్దాంతానికి కట్టుబడ్డ ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే తాజాగా పార్టీకి ఆయన సేవలకు గుర్తింపుగా అన్నట్లు దత్తాత్రేయను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అంతే కాకుండా ఆయనను కేరళ రాష్ట్ర పార్టీ ఇంఛార్జిగా కూడా నియమించారు. ఇంతకుముందు రాష్ట్రం నుండి బంగారు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన తరువాత వెంకయ్యనాయుడుకు కూడా ఆ పదవి దక్కింది. ఇటీవల రాజ్ నాథ్ సింగ్ పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాక రాష్ట్రానికి చెందిన మురళీధర్ రావు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఇప్పుడు బండారు దత్తాత్రేయకు కూడా పార్టీలో సముచిత ప్రాధాన్యం దక్కింది.