Next Page 
దేవదాసు పేజి 1


                                దేవదాసు

                                                                                      - శరత్

 



    అది వైశాఖ మాసం. మిట్ట మధ్యాహ్నం. మండు టెండ మిటమిట లాడుతూ వుంది. వాతావరణంలో వేడి అపరిమితంగా వుంది. సరిగ్గా అదే సమయంలో ముఖోపాధ్యాయగారి వంశాంకురం దేవదాసు, పాఠశాలలోని ఒక గదిలో ఒక మూలన స్లేట్ చేతిలోకి తీసుకొని, కాళ్ళు ఆరజాపుకొని, అకస్మాత్తుగా ఒళ్ళు విరుచుకుంటూ అత్యంత ఉద్విగ్నుడై పోయాడు. ఇటు వంటి మనోహరమయిన సమయంలో మైదానం మీదికి వెళ్ళి గాలిపటాలు ఎగర వేసుకొనడానికి బదులు పాఠశాలలో బందీగా పడివుండటం అమిత మైన దఃఖాన్ని కలుగజేస్తుందని క్షణంలో అతడు నిశ్చయించుకున్నాడు. సారవంతమైన అతడి మస్తిష్కంలో నుంచి ఓ ఉపాయం కూడా బయట పడింది. అతడు స్లేట్ తీసుకొని, అలాగే లేచి నిలబడ్డాడు.
    పాఠశాలలో ఇప్పుడే అల్పాహారానికి సెలవిచ్చారు. మగ పిల్లవాళ్ళ సమూహం రకరకాల ఆటపాటలతో, అల్లరి చేష్టలతో అక్కడే వున్న రావిచెట్టు క్రిందికి చేరి బిల్లగోడు ఆట ఆడుతూ వున్నారు. దేవదాసు ఒక్కసారి అటువైపు చూశాడు. అతడికి అల్పాహారపు సెలవు లభించదు. ఎంచేత నంటే ఒకసారి పాఠశాల విడిచి బయటికి వెళ్ళిన తరువాత మళ్ళీ తిరిగి రావడానికి దేవదాసు ఇష్టపడడు. అలా తిరిగి రాకపోవడం గోవింద్ పండితుడు అనేకసార్లు చూశాడు. దేవదాసు తండ్రి కూడా సెలవు ఇవ్వడానికి అనుమతించలేదు. అనేక కారణాల వలన ఇప్పటినుంచి అతణ్ని విద్యార్ధి నాయకుడయిన (మానిటర్) భూలో పర్యవేక్షణలో వుంచేటట్లుగా నిశ్చయించారు.
    ఒక గదిలో పండితులవారు మధ్యాహ్నపు బడలికను పోగొట్టుకొనడానికి కళ్ళు మూసుకొని నిద్రబోయాడు. విద్యార్ధి నాయకుడు (monitor) భూలో ఒక మూలన కాళ్ళూ చేతులు చాపుకొని ఒక బెంచీ మీద కూర్చొని వున్నాడు. మధ్య మధ్యలో ఉపేక్షగా ఒకప్పుడు ఆ మగపిల్లల సమూహాన్ని మరొకప్పుడు పార్వతీ, దేవదాసులను చూస్తూ పోతున్నాడు. పార్వతి పండితులవారి ఆశ్రయంలోకి, పర్యవేక్షణలోకి వచ్చి ఇప్పుడే పూర్తిగా ఒక నెల మాత్రమే అయ్యింది. పండితులవారు యీ కొద్దికాలంలోనే ఆమె మనసుకు బాగా వినోదం కలిగించారు. అంచేత ఏకాగ్రతతో, ధైర్యంగా నిద్రిస్తున్న పండితులవారి చిత్రాన్ని "బోధోదయ" పుస్తకంలోని చివరి పేజీ మీద సిరాతో చిత్రిస్తూ వుంది. బాగా ఆరితేరిన చిత్రకారిణిలాగా వివిధ భావాలతో, ఎంతో ప్రయత్నంతో గీసిన ఆ చిత్రం ఆదర్శానికి ఎంత దగ్గరగా వుందో అని చూస్తూ వుంది. ఆ చిత్రంలో ఆయన పోలిక అంత ఎక్కువగా కన్పించకపోయినా, ఆ చిత్రించగలిగిన రూపం చూసి ఆమెకు అమితమైన ఆనందమూ, ఆత్మసంతృప్తీ కలుగుతూ వున్నాయి.
    ఇదే సమయంలో దేవదాసు స్లేట్ చేతిలోకి తీసికొని లేచి నిల్చున్నాడు. భూలోను ఉద్దేశిస్తూ- "ఈ లెక్క తెలియడంలేదు" అన్నాడు.
    భూలో శాతంగా, గాంభీర్యంగా "ఏమిటా లెక్కా?" అన్నాడు
    "వ్రాత లెక్క..."
    "స్లేట్ చూడనివ్వు!"
    అతడి పనులన్నీ స్లేట్ చేతిలోకి తీసుకోవడంతోనే అయిపోయేవి. దేవదాసు స్లేట్ అతడి చేతికిచ్చి దగ్గరగా నిలబడి వున్నాడు. భూలో ఇలా అంటూ వ్రాస్తున్నాడు-ఒక మణుగు నూనె ధర పదునాలుగు రూపాయల తొమ్మిది అణాల, మూడు దమ్మిడీలు అయితే....?
    అదే సమయంలో ఓ సంఘటన జరిగింది. కాళ్ళూ చేతులూ లేని బెంచీ పైన విద్యార్ధి నాయకుడు తన పదవికి గల గౌరవానికి తగినట్లుగా ఆసనాన్ని నిశ్చయించుకొని, నియమపూర్వకంగా ఇప్పటికి మూడు సంవత్సరాల నుంచీ కూర్చుంటూ వస్తున్నాడు. దాని వెనుక తెల్లని పొడి సున్నం ఒక గుట్టగా పోసి వుంది. దీన్ని ఎప్పుడో పండితులవారు చౌక ధరకు కొని వుంచాడు. మంచిరోజు మళ్ళీ తిరిగివస్తే పక్కా ఇల్లు కట్టించాలని అనుకొన్నాడు. ఆ మంచిరోజు యెప్పుడు తిరిగి వస్తుందో నాకు మాత్రం తెలియదు. కాని ఆ తెల్లని సున్నాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ప్రపంచంతో పరిచయం లేనటువంటి, దూరాలోచన లేనటువంటి ఏ దరిద్రపు అర్భకుడు కూడా అందులో ఒక్క కణాన్ని కూడా నష్టపరచలేకపోతున్నాడు. అంచేత ఆయన ప్రేమకు పాత్రుడయిన, వయసులో పిల్లలందరికన్న పెద్దవాడయిన భోలానాథ్ (భూలో)కు ఎంతో ప్రయత్నపూర్వకంగా కూడబెట్టిన వస్తువును జాగ్రత్తగా కాపాడే బాధ్యత లభించింది. అంచేతనే అతడు బెంచీ మీద కూర్చొని దానిని చూస్తూ వుంటాడు.
    భోలానాథ్ వ్రాస్తూ వున్నాడు_ఒక మణుగు నూనె ధర పదునాలుగు రూపాయల, తొమ్మిది అణాల, మూడు దమ్మిడీలు అయితే...? "ఓరి బాబోయ్" అని కేక, ఆ తరువాత పెద్ద గందరగోళమయింది. పార్వతి పకపకా నవ్వుతూ, చప్పట్లు చరుస్తూ నేలమీద పడి దొర్లుతూ వుంది. నిద్రపోయిన గోవింద్ పండితుడు ఎర్రటి కళ్ళను మూసుకుంటూ గాభరాపడుతూ లేచి నిల్చున్నాడు. చెట్టు క్రింద పిల్లవాళ్ళ గుంపు బారుదీరి ఒక్కసారిగా "హో హో" అని అరుస్తూ పరుగెత్తుకొస్తూ వుండడం చూశాడు. ఆ సమయంలోనే  ఆ విరిగిపోయిన బెంచీ పైన ఒక జత పాదాలు నర్తిస్తున్నాయి. ఆ సమయంలో ఆ సున్నపు రాశిలో అగ్నిపర్వతం బద్దలయిందా అన్నట్లు, బాంబు ప్రేలిందా అన్నట్లు పెద్ద ధ్వని వినిపించింది. అరుస్తూ "ఏమిటి, ఏమిటి _ఏమిటిరా?" అని అడిగాడు.
    జవాబు చెప్పడానికి కేవలం పార్వతి మాత్రమే వుంది. కాని అప్పుడామె నేలమీద దొర్లుతూ చప్పట్లు చరుస్తూ వుంది. పండితులవారి విఫలమయిన ప్రశ్న క్రోధంగా మారిపోయింది__"ఏమిటీ__ఏమిటీ__ఏమిటిరా?
    ఆ తరువాత శ్వేతమూర్తి భోజనాద్ సున్నం దులుపుకొని నిల్చున్నాడు పండితులవారు మరింతగా అరుస్తూ__
"ఓరి దుష్టుడా! నీవేనా, నీవేనా ఆ సున్నపు గుట్టలో పడివుందీ?" అన్నాడు.
    ఆఁ__ఆఁ__ఆఁ


Next Page 

WRITERS
PUBLICATIONS