Previous Page Next Page 
పంచభూతాలు పేజి 3

      ఈ విషయంలో నేను ఎక్కువగా మాట్లాడాను. కాని శ్రీమతి నిర్ఘరిణి అంతా విని ఏదో మాట్లాడాలని వ్యాకుల పడింది. నేను నా మాటలను కట్టిపెట్టాను. నేను యేకధాటిగా మాట్లాడి వుంటే ఆమె శీఘ్రంగానే తన ప్రసంగం కట్టిపెట్టి వుండేది. అయినా మౌనం వహించాను. కొద్ది క్షణాల తరువాత ఆమె,  "యేవిఁటి భాయీ! నాకు మాత్రం యిదంతా అన్నిటికంటే ఎక్కువ ఆపదజనకంగా తోస్తోంది. మేము మా దైనందిన అనుభవాలను లిపిబద్దం చేస్తే దాని పరిణామం సరిగావుండదు. ఒక సామాన్య కారణం చేత  మాకు అనేక రాగద్వేషాలు, సుఖ దుఃఖాలు కలుగుతుంటాయి. వాటిని మేము  సహిస్తూనే వుంటాం. అవి విశేష కారణబద్ద అసహ్యంగా వుంటాయి. వాస్తవానికి అపరాధం లేని సమయంలో అపరాధం ప్రఖ్యాతిలోకి వస్తుంది. అనేకసారులు మేము ఆరోగ్యంగా జీవించలేక పోవడానికి కారణం యితరులకు అన్యాయం చేస్తూ కూర్చోవడమే. కాని కాలక్రమేణా ఆ దుఃఖం,  ఆ అన్యాయం,  అపరాధం మరిచేపోతం. ఈ విధంగా మెల్లమెల్లగా అత్యాచారం దూరమవుతుంది. కేవలం సాధారణ విషయాలు మాత్రమే నిలిచిపోతాయి  వాటిమీద మాకు వాస్తవికమైన అధికారం వుంటుంది. మేము డైరీలో  నియమితతను పాటిస్తే కృత్రిమ ఉపాయంతో మా జీవితంలోని చిన్న చిన్న ప్రత్యేక విషయాలకు పోరాటం సంభవిస్తుంది. తుచ్చ ఘటనలు సంభవించే చేష్టలు చేసి వాటిని నష్టపరుస్తాం" అన్నది.
    అకస్మాత్తుగా శ్రీమతి నిర్ఘరిణికి చైతన్యం కలిగింది. ఆమె మాటలలో మహదావేగం పొడ చూపింది. మొహం ఎర్రబడింది. కొంచెం మత్తుతో, "నేను సరిగా చెప్పలేకపోయాను. తెలిసింది కూడా మరిచేపోయాను" అన్నది.
     ప్రకాశవతి సంకోచించలేదు. ఆమె మాటలాడడంలో కూడా సాటి లేనిది.  ఆమె తాత్కాలికంగా ప్రత్యుత్తర మివ్వడానికి సంసిద్దురాలవడం చూసి నేను, "నువ్వు సరిగానే గ్రహించావు. నేను కూడా అలా మాట్లాడే వాడినే కాని నేను నీలాగ మాట్లాడలేను. ఇందులో సందేహం లేదు. శ్రీమతి ప్రకాశవతికి యీ విషయం మరిచేపోవాలని  లేదు. ఆధిక్యత  కోసం చేసే చేష్టలవల్ల  మనసు తెలిసిపోతుంది. ఆదాయంతోపాటు ఖర్చూవుంటుంది. తన యౌవనంలోని అధిక భాగం, మరిచేపోయి, పోగొట్టుకొని, వ్యర్ద పుచ్చి మేము ముందుకు వెళ్లడంలో సమర్దుల  మవుతాం. వస్తువులను యే మాత్రం సమకూర్చినా, చినిగిన వస్త్రాన్ని మూటగట్టినా లాభమేముంది?   జీవితంలో  ప్రతిక్షణాన్ని రాతలోపెడితే  ఏమిటి లాభం? చిన్న చిన్న మాటల మీద భావాలమీద ఘటనలమీద ఆధిపత్యం వహించదలచిన మనిషితో సమానమయిన దౌర్బాగ్యజీవి ఈ భూమి మీద మరొకడు వుండడు" అని నేను అన్నాను.   
    ప్రకాశవతి కృత్రిమంగా నవ్వి, "డైరీ రాయడం  సంగతి  చెప్పారనే విషయం మరిచేపోయాను. యిక అలా యెన్నడూ మరిచిపోను" అన్నది.
     పవన్ ఈ మాటలు విని, "ఇటువంటి  మాటలు నోటి నుంచి యెందుకు వెలువడుతాయో? అపరాధం  అంగీకరించడంతో సమానమైనది ఈ ప్రపంచంలో మరే భ్రమా లేదు. దోషం అంగీకరించడం వల్ల అపరాధిని చిన్న చూపు చూస్తారని లోకులు భ్రమిస్తారు.  కాని అదేం కాదు.  రెండవది: యెవరినయినా గద్దించడంవల్ల కలిగే సుఖం దుర్లభ సుఖం. దోషమును ఎంత యింపుగా చెప్పినా విచారణ  కర్త దానిని అంత బలవంతంగా పొందుతాడు. ఏ విధంగా డైరీ రాయాలా అని యోచిస్తుంటాను" అన్నాడు.
     "నేను కూడా సంసిద్దంగానే వున్నాను. కాని నేను నా విషయాలను డైరీలో రాయను. మనందరి విషయాలూ రాస్తాను. ఆ విషయాలు ప్రతిదినం ఆలోచనలను రేకెత్తిస్తాయి అని నేను అన్నాను.
     శ్రీమతి నిర్ఘరిణీదేవి కొంచెం సంకోచించింది. పవన్ చేతులు జోడించి, క్షమించవలసిందని ప్రార్దిస్తూ, "సకల విషయాలు రాసేటట్లైతే చెప్పండి మేము ఇంటి నుంచి విషయాలు జ్ఞాపకం  పెట్టుకుని వస్తాం.  విషయాలు చెప్పడంలో మరిచిపోతే ఇంటికి పరుగెత్తుతాం. విషయాలు  తగ్గిన కొలదీ కష్టం ఎక్కువవుతుంది. నువ్వు పూర్తిగా  సత్యహరిశ్చంద్రుడిలా  తయారుకా నేను మాత్రం  సమస్య నుంచి తొలగిపోతాను" అన్నాను.
     "ఉహుఁ అలాకాదు. నేను మిత్రులనే వినయ పూర్వకంగా  బలవంత పెడతాను. సత్యాన్ని కాదు, నువ్వు చీకూ చింతాలేకుండా వుండు. నేనుమాట్లాడతాను" అన్నాను.
     శ్రీ పృద్వీరాజ్ కళ్లతో ఉరిమి చూచి, "అలా అయితే యింకా చెడు సంభవిస్తుంది. నీ చేతితో  లేఖిని పట్టుకుంటే యుక్తి రహిత మాటలు ఎలా వెలువడతాయో నాకు బాగా తెలుసు. అది మా చేత చెప్పించుతుంది. ఖండింపనలవి కాని యుక్తిని నువ్వు స్వయంగా వెలువరిస్తావు" అన్నాడు.
     "నేను యెవరివల్ల యుక్తిలో పరాజయం పొందుతానో కలం ద్వారా అతనికి ప్రతీకారం చేసి వదులుతాను. యింతవరకు మీ ఉపద్రవాలను ఎన్నో సహించాను. ఇక వాటికి ప్రతీకారం చేస్తాను" అని నేను అన్నాను.
    పృద్వీరాజ్ సంతోషించి, "తధాస్తు! గగన్ ఏమీ మాట్లాడలేదు. కొద్ది క్షణాల వరకు నవ్వుతూనే వున్నాడు. అతని గంభీరత నేటివరకు నాకు తెలియలేదు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS