రాములవారి అక్క ..శాంత!

 

 

రాముని చరిత్రకు సంబంధించి వాల్మీకి రామాయణాన్నే ప్రామాణికంగా భావిస్తారు. కానీ వాల్మీకి రామాయణంలో కనిపించని చాలా గాథలు ప్రచారంలో ఉన్నాయి. మనం తరచూ వినే ‘లక్ష్మణరేఖ’ వంటి ఘట్టాలు మూల రామాయణంలో లేవని చెబుతుంటారు. అలాంటి మరో గాథే రాములవారి అక్క గురించిన కథ!

దశరథునికి రాములవారు జన్మించక ముందే ‘శాంత’ అనే కుమార్తె జన్మించిందట. కానీ ఆమెను అంగదేశాధీశుడైన రోమపాదుడు అనే రాజుకి దత్తతుగా ఇచ్చాడట దశరథుడు. రోమపాదుడు దశరథుని స్నేహితుడు. పైగా రోమపాదుని భార్య, కౌసల్యకి సోదరి. దాంతో సంతానం లేక బాధపడుతున్న ఆ దంపతులకి తన కూతురిని దత్తతు ఇచ్చారట.

శాంత అంగరాజ్యంలో అపురూపమైన రాజకుమారిగా పెరగసాగింది. అస్త్రవిద్యలలోనూ, వేదవేదాంగాలలోనూ అపారమైన నైపుణ్యాన్ని సాధించింది. అద్భుతమైన వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వానికి దీటైన అందం ఆమె సొంతం. ఒకరోజు శాంత, రోమపాదునితో కలిసి ఏదో చర్చలో మునిగిపోయి ఉండగా... ఒక బ్రాహ్మణుడు వారి వద్దకు వచ్చాడు. తను వ్యవసాయం చేయదల్చుకున్నాననీ, ఆ వ్యవసాయానికి ఏదన్నా సాయం అందించమనీ ఆ బ్రాహ్మణుడు రోమపాదుని వేడుకున్నాడు. కానీ కూతురితో కలిసి శాస్త్ర చర్చలలో మునిగిపోయిన రోమపాదుడు ఆ బ్రాహ్మణుని అభ్యర్థనని ఆలకించనేలేదు. తన భక్తునికి జరిగిన అవమానాన్ని దేవలోకాధిపతి ఇంద్రుడు సహించలేకపోయాడు. అంగ రాజ్యం కరువుకాటకాలతో దుర్భిక్షంగా మారిపోతుందని శపించాడు.

ఏళ్లు గడుస్తున్నా తగిన వర్షాలు కురవకపోవడంతో ఏం చేయాలో అంగవాసులకి పాలుపోలేదు. అసాధారణమైన గుణవంతుడు యాగాన్ని తలపెడితే, రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయని రాజగురువులు సలహా ఇస్తారు. దాంతో అంతటి శీలవంతుడు ఎక్కడ ఉన్నాడో అని ఆలోచించినవారికి రుష్యశృంగుడునే మునికుమారుడు గుర్తుకువస్తాడు. ఆ రుష్యశృంగుని ఆకర్షించి, అంగరాజ్యానికి తీసుకువచ్చేందుకు స్వయంగా రాకుమారి శాంత బయల్దేరుతుంది. అపురూప సౌందర్యరాశి అయిన శాంతని చూడగానే రుష్యశృంగుడు ఆమె ప్రేమలో పడతాడు. ఆమె కోరిక మేరకు అంగదేశానికి చేరుకుని వరుణ యాగాన్ని నిర్వహిస్తాడు. అతని యాగానికి మెచ్చి వరుణదేవుడు వర్షాన్ని కురిపించడం, రోమపాదుడు శాంతను రుష్యశృంగునికి ఇచ్చి వివాహం జరిగిపించడం వెనువెంటనే జరిగిపోతాయి.

ఒకరకంగా రాములవారు అవతారం దాల్చేందుకు కూడా శాంతే కారణం. ఎందుకంటే అంగరాజ్యంలో నివాసాన్ని ఏర్పరుచుకున్న రుష్యశృంగుడే తర్వాతకాలంలో దశరథుని చేత పుత్రకామేష్టియాగాన్ని చేయిస్తాడు. ఆ యాగఫలంగానే రామలక్ష్మణభరత శతృఘ్నులు జన్మిస్తారు. శాంత గాథ పూర్తిగా కల్పితం కాదనేందుకు కొన్ని సాక్ష్యాలు ప్రామాణికంగా నిలుస్తాయి. ఉత్తరాదిన ‘రిషివంశి’ అనే క్షత్రియవంశంవారు తాము రుష్యశృంగ, శాంతల వారసులం అని ఇప్పటికీ నమ్ముతారు. రుష్యశృంగ దంపతుల పేరిట నేపాల్లోని మహాలక్ష్మి అనే పట్నంలో ఒక గుడి కూడా ఉంది. దేవదత్త పట్నాయక్ వంటి ఆధ్మాత్మిక రచయితలు శాంతను మర్చిపోలేని, మరువగూడని పాత్రగా పేర్కొంటున్నారు.

- నిర్జర.

 


More Purana Patralu - Mythological Stories