వేంకటేశ్వరుడు ధరించే స్త్రీ రూపం – మోహిని!

తిరుమల బ్రహ్మోత్సవాలలో ఐదోరోజున ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇతర రోజులలో స్వామివారు ఏదన్నా వాహనం మీద ఊరేగితే.... ఐదవ రోజున మోహినీ అవతారంగా మారి పల్లకీ మీద ఊరేగుతారు. లోకకళ్యాణం కోసం స్వామివారు అసంఖ్యాకమైన అవతారాలు ధరిస్తూ ఉంటారు. కానీ వాటిలో మోహినీ అవతారానిది ఓ ప్రత్యేక స్థానం. ఎందుకంటే...

మోహానికి ప్రతిరూపమే మోహిని. ఈ అవతారపు మూలాలు క్షీరసాగరమథనంలోనే కనిపిస్తాయి. రాక్షసులకు అమృతం దక్కకుండా, వారి దృష్టిని మరల్చేందుకు విష్ణుమూర్తి దాల్చిన రూపే ‘మోహిని’. ఆ మోహిని మాయలో పడిన రాక్షసులు అమృతాన్ని సైతం పోగొట్టుకుంటారు. పైకి సరదాగా కనిపించే ఈ కథ వెనుక జీవితపు సత్యం కూడా గోచరిస్తుంది. క్షీరసాగరమథనాన్ని సంసారపు జంఝాటాలతో పోలుస్తారు. ఇందులో మోహానికి కనుక లోబడిపోతే, మనిషిలోని తామస తత్వం రాక్షస స్థాయికి దిగజారిపోతుంది. ఆ మోహాన్ని దాటుకుంటేనే జన్మరాహిత్యం అనే అమృతం దక్కేది. మోహినీ అవతారం క్షీరసాగరమథనంలోనే కాకుండా ఇతర సందర్భాలలో కూడా ప్రస్తావన వస్తుంది. భస్మాసురుడనే రాక్షసుని మోహితుడిగా చేసి, తన చేత్తో తనే భస్మమయ్యేట్లుగా చేస్తుంది మోహిని. గణేశుని పురాణంలో విరోచనుడనే రాక్షసుని సంహరించడంలో కూడా మోహిని పాత్ర వహించినట్లు తెలుస్తుంది.

మోహిని అంటేనే సమ్మోహనం కలిగించేది అని అర్థం. ఆ సమ్మోహనానికి శివుడు సైతం ఆకర్షితుడు కాక తప్పనేలేదు. అలా ఆ పరమేశ్వరునికీ, మోహినికీ మధ్య జన్మించినవాడే ‘అయ్యప్ప’. అందుకే ఆయనను హరిహరసుతునిగా పిలుస్తారు. హరిహరులు మధ్య బేధం లేదని నిరూపించే వృత్తాంతమే అయ్యప్ప జననం. కొన్ని పురాణాలలో హనుమంతుని సైతం హరిహరసుతునిగానే పేర్కొంటారు. హరిహరుల కలయిక భౌతికదృష్టిలో విచిత్రంగా తోచినా... వారిరువురూ ఒక్కటే అని చాటి చెప్పడమే ఇలాంటి కథలలోని పరమార్థంగా తోస్తుంది.

కొన్ని ప్రదేశాలలో మోహినిని శివుని భార్యగానే కొలుస్తారట. మహారాష్ట్రలో శివుని అవతారమైన ఖండోబా భార్యను ‘మహల్సా’ అని పిలుస్తారు. ఆమె మోహినీయే! సాయి ముఖ్య భక్తుని పేరు ‘మహల్సాపతి’. అంటే మోహినీదేవి భర్త అని అర్థం. ఇక మన తెలుగునాట కూడా మోహినీకి తగిన స్థానమే కనిపిస్తుంది. మోహినీదేవి జడ నుంచి ఒక పూవు ‘రాలి’ పడిందట. ఆ ‘రాలి’ అన్న పదం నుంచే గోదావరి జిల్లాలోని ‘ర్యాలి’ అనే క్షేత్రం వెలిసింది. ఈ క్షేత్రంలో విష్ణుమూర్తి ముందుభాగాన పురుషునిగానూ, వెనక మోహినిగానూ కనిపిస్తారు.

 

 

తత్వవేత్తల దృష్టిలో విష్ణుమూర్తి మాయావిలాసమే మోహిని అవతారం. ఆయన ఈ లోకాన్ని నడిపించే స్థితికారుడు. మరి ఈ లోకం నిజమే అన్న భ్రాంతిలో జీవులు మనుగడ సాగించాలంటే ‘మాయ’ ఉండాల్సిందే కదా! ఆ మాయకు ప్రతిరూపమే మోహిని! అందుకనే ఈ రూపుని విష్ణుమూర్తి దశావతారాలలో ఒకటిగా ఎంచరు. ఇదీ మోహినీ అవతారపు ప్రత్యేకత. ఇక బ్రహ్మోత్సవాల ఘట్టానికి తిరిగివస్తే.... ఐదో రోజు ఉదయం మోహినీ అవతారంగా ఊరేగే వేంకటేశుడు, సాయంవేళలో తన నిజవాహనుడైన గరుడుని ప్రతిరూపం మీద ఊరేగుతారు. గరుడుని స్వామివారి తొలిసేవకునిగానూ, పరమభక్తునిగానూ ఎంచుతారు. అందుకే తమిళురు ఆయనను గరుడాళ్వారుగా పిలుస్తారు.

బ్రహ్మోత్సవాలలో ఆరవ రోజు ఉదయాన స్వామి హనుమంత వాహనం మీద ఊరేగుతారు. త్రేతాయుగంలో రామునిబంటుగానూ, ద్వాపరయుగంలో కృష్ణుని తోడుగానూ నిలిచిన హనుమంతుడు... కలియుగంలోనూ స్వామి సేవలో ఉంటాడనేందుకు ప్రతీకే హనుమంత వాహనం. రాముడు, కృష్ణుడూ ఆ వేంకటేశుడే అని తేల్చి చెప్పడమే ఈ సేవలోని ఆంతర్యం. ఆరవరోజు సాయంవేళ స్వామి గజవాహనం మీద ఊరేగుతారు.

గజవాహనం అనగానే గజేంద్రమోక్షపు ఘట్టం గుర్తుకురాక మానదు. ఎంతటివారైనా, ఎలాంటి ఆపదలో ఉన్నా... ఆ విష్ణుమూర్తిని తల్చుకోగానే ఉన్నఫలంగా బయల్దేరివస్తాడని ‘గజేంద్ర మోక్ష ఘట్టం’ సూచిస్తుంది. అంతేకాదు! ఏనుగు అలవికాని శక్తికీ, మదానికీ సూచన. స్వామి ఆరాధన భక్తికీ, నమ్రతకూ చిహ్నం. ఆ భక్తితోనే మనలోని పశుమదాన్ని జయించగలం అన్న తత్వమూ గజవాహనంలో కనిపిస్తుంది.
(బ్రహ్మోత్సవాల ఆరో రోజు సందర్భంగా)

 

 


More Tirumala Brahmotsavam