కాశీ కబుర్లు - 21 ప్రయాగలో దర్శనీయ స్ధలాలు -1

పాతాళపుర మందిర్

 

 

త్రివేణీ సంగమం ఒడ్డునే అక్బర్ చక్రవర్తి కట్టించిన కోట వున్నది.  దీనిలోకి అందరికీ ప్రవేశం  లేదు.  ఆర్మీ వున్నది ప్రస్తుతం ఆ కోటలో.  అయితే ఈ కోటలో వున్న పాతాళ పుర మందర్ కి మాత్రం ఏ అనుమతి అవసరం లేకుండా వెళ్ళి రావచ్చు.  ఫోటోలు తియ్యనియ్యరు.

ఇక్కడ- వున్న వట వృక్షం అతి పురాతనమయినది.  మొదట్లో ఈ వటవృక్షం మొదలు భూమి ఉపరితలంపైనే వుండేదట.  చైనా యాత్రీకుడు హుయాన్త్సాంగ్ వచ్చినప్పుడు ఈ వటవృక్షం బయట ఆవరణలోనే వుండేదిట.  అక్బర్ కోట కట్టించేటప్పుడు స్ధలం ఎత్తు పెంచవలసి రావటంతో ఇవి భూ గర్భంలోకి వెళ్ళాయి.  అయితే అంత పెద్ద కోట కట్టించేటప్పుడుకూడా అక్బర్ ఈ ఆలయాన్ని యధాతధంగా అట్టిపెట్టి తన మత సామరస్యాన్ని చాటుకున్నాడు.

ప్రయాగలో మరణిస్తే మోక్షం లభిస్తుందనే నమ్మకంతో పూర్వకాలంలో ఈ చెట్టు మీదనుంచి కింద వుండే కామ్య కూపంలో దూకి ఆత్మాహుతు చేసుకునేవాళ్ళట.  తన పూర్వ జన్మలో అక్బర్ చక్రవర్తి కూడా ఈ చెట్టుమీదనుంచి దూకి ప్రాణ త్యాగం చేశాడుట.  అయితే ఆ సమయంలో ఆయన భారత దేశానికి చక్రవర్తిని కావాలని కోరుకున్నాడనీ అందుకే మరు జన్మలో చక్రవర్తి అయ్యాడనీ అక్కడి గాధ.  హిందువులే కాదు, ముసల్మాన్ ఫకీర్లు కూడా ఈ చెట్టునుంచీ  హుక్ లకి వేళ్ళాడేవాళ్ళుట.  అయితే ఇది అక్బర్ మాన్పించాడు.

పూర్వం ఈ ఆలయంలోకి వెళ్ళే మార్గం చాలా ఇరుకుగా వుండేది.  మార్గంలోను, లోపల  తగిన వెలుతురు కూడా వుండేది కాదు.  అయితే స్ధానికి ప్రజల పట్టుదలవల్ల సందర్శకులు తేలికగా వెళ్ళటానికి సరైన మార్గం, గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ఏర్పాట్లు చెయ్యబడ్డవి.

84 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పు గల పెద్ద హాలులాగా వుంటుంది ఈ పాతాళపురి మందిర్.  దీనిలో ధర్మరాజు పిండప్రదానం చేస్తున్న శిల్పం, వేద వ్యాసుడు, అర్ధ నారీశ్వరుడు, వాల్మీకి, సనక సనందులు వగైరా అనేక ఋషులు, దేవతా విగ్రహాలున్నాయి.  ఇవి అన్నీ అంత పురాతనంగా అనిపించలేదు.

ఇక్కడే వట వృక్షం మొదలు కూడా వుంది.   ఈ వట వృక్షానికున్న రెండు మొదళ్ళు మాతా పితరులకు ప్రతీకలని ఇక్కడ పూజారి మన గోత్ర నామాలు చెప్పి వాటిని కౌగలించుకోమంటారు.  వట వృక్షం మొదలు మాత్రమే ఇక్కడ వుంటుంది.  పై భాగం భూమి వుపరితలం మీదే వుంటుంది.

శ్రీ రాముడు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చి ఈ వట వృక్షం కింద కూర్చున్నాడని, ఇక్కడ తండ్రికి శ్రాధ్ధ కర్మలు నిర్వహించాడని అంటారు.  భరతుడు శ్రీ రాముని వెతుక్కుంటూ వచ్చి, ఆయన ఇక్కడ ఆగాడని తెలుసుకుని ఆ వట వృక్షానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు విగ్రహం వున్నది.

ఈ కోటలోనే ప్రసిధ్ధికెక్కిన అశోక స్ధంబం వున్నది.  దీనిని కౌశంబినుంచి తెచ్చి ఇక్కడ స్ధాపించారు.

కనీసం ఒక గంట సమయం వుంటే ఈ ఆలయాన్ని చూడవచ్చు.  అంత సమయం లేనప్పుడు, వటవృక్షాన్ని చూసి ఒక్కసారి వాతాళ మందిర్ లోకి తొంగి చూసి వచ్చేయచ్చు ఆ విగ్రహాలన్నీ ఎవరివని వివరంగా చూడకుండా.  మా వేన్ డ్రైవర్ దీన్ని చూడకుండా తీసుకుపోదామని చూశాడు.  అది కోట.  పర్మిషన్ లేకుండా వెళ్ళనవ్వరు అని.  నాకు హింది చదవటం రావటం వల్ల పేరు చదివి అది మందిర్, మందిర్ కి పర్మిషన్ అక్కరలేదు ఒకసారి చూసొచ్చేస్తాము కోటలోకి వెళ్ళొచ్చినట్లుంటుందని పట్టుబట్టి వెళ్ళాను.  ఇది ఎందుకు చెబుతున్నాను అంటే ఇలాంటివి వున్నాయని ఈ డ్రైవర్లల్లో కొందరికి తెలియదు, కొందరు ఈ ట్రిప్ త్వరగా పూర్తి చేసుకుని ఇంకో బేరం చూసుకుందామనే హడావిడో ఏమిటోగానీ కొన్ని ప్రదేశాలు మనల్ని చూడనివ్వరు.  అలా మేము వదిలేసినవన్నీ చివరికి వ్రాస్తాను.  మీకు వీలయితే చూడండి.

 

-పి.యస్.యమ్. లక్ష్మి

 (తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Kashi Yatra