ఏడుకొండల విశేషాలు

 

 

శ్రీ మహావిష్ణువును చూసేందుకు వాయుదేవుడు వైకుంఠానికి వచ్చాడు. ఆదిశేషువు, వాయుదేవుడిని అడ్డగించి "మహావిష్ణువు పడుకుని ఉన్నాడు, ఇప్పుడు కలవడానికి వీల్లేదు" అని చెప్పాడు. వాయుదేవునికి కోపం వచ్చింది. ఆదిశేషువుతో యుద్దం చేశాడు. ఇంతలో విష్ణుమూర్తి లేచి వచ్చాడు. ఇద్దరూ, ఎవరికి వారే తమ గొప్పతనం చెప్పుకున్నారు.

మహావిష్ణువు ఆదిశేషుడు, వాయుదేవుళ్ళకు పరీక్ష పెట్టాడు. ఆదిశేషువుతో, మేరుపర్వతానికి ఉత్తర దిక్కులో ఉన్న ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టి పట్టుకోమన్నాడు. వాయుదేవునివైపు తిరిగి బలప్రయోగం చేసి, ఆ పర్వతాన్ని అక్కణ్ణించి కదిలించమని చెప్పాడు.

ఆ పరీక్షకు విశ్వమంతా ఆశ్చర్యపోయింది. అల్లకల్లోలం చెందింది. దేవతల మాట విని ఆదిశేషువు ఆనంద పర్వతంమీద పట్టు సడలించి పరీక్ష నుండి తప్పుకున్నాడు. దాంతో ఆనంద పర్వతం వాయువు ప్రభావంతో ఒక్క ఉదుటున వెళ్ళి సువర్ణముఖి నది ఒడ్డున పడింది. ఇది చూసి ఆదిశేషుడు బాధ పడ్డాడు.

బ్రహ్మదేవుడు తల పంకించి, ఆదిశేషునితో "నిన్ను వెంకటాద్రితో విలీనం చేస్తాను. ఈ వెంకటాద్రిపై శ్రీ మహావిష్ణువు వేంకటేశ్వరునిగా అవతరించనున్నాడు" అని చెప్పాడు.

అదీ సంగతి. నల్లమల కొండలను ఆదిశేషునిగా భావిస్తారు. ఆదిశేషుడు వెంకటాద్రిలో విలీనం అయ్యాడు. తిరుమలలో మొదలై, శ్రీశైలంలో అంతమౌతుంది. ఏడు కొండల పేర్లు వరుసగా అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వెంకటాద్రి, వృషభాద్రి. ఆదిశేషువు పడగ భాగం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, శేషువు మధ్య భాగం అహోబిలం శ్రీ నరసింహ స్వామి, తోక భాగం శ్రీశైలం మల్లికార్జున స్వామి వెలశారు.


More Venkateswara Swamy