హనుమాన్‌ అంటే!

 

హైందవులకు పరమ పూజనీయుడు హనుమంతుడు. కలియుగం ఉన్నంతవరకూ చిరంజీవిగా నిలుస్తూ, భక్తుల కష్టాలను తీరుస్తూ ఉంటాడని నమ్మకం. ఇంతకీ హనుమంతుడు అని పదే పదే తల్చుకునే ఆ పేరు వెనుక మర్మం ఏమిటో...

వాయుదేవుని ద్వారా శివుని తేజం అంజనాదేవి అనే వానరకాంతకు చేరింది. అలా జన్మించినవాడు అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అన్న పేరు కూడా లేకపోలేదు. ఇక ఆంజనేయుడు బాల్యం నుంచీ చిలిపివాడే. అసలే, నిమిషమైనా కుదురుగా ఉండలేని వానరజీవి. దానికి తోడు శివుని తేజము, వాయుదేవుని అంశ, కేసరి శక్తి ఉండనే ఉన్నాయి. దాంతో ఆయనను పట్టడం సాధ్యమయ్యేది కాదు.

ఒకసారి ఆంజనేయుడు ఆకాశంలో సంచరిస్తుండగా ఎర్రటి సూర్యబింబం కనిపించింది. ఎర్రగా, గుండ్రంగా, తళతళలాడిపోతూ ఉన్న బింబాన్ని చూసి అదేదో పండు అని భ్రమించాడు ఆంజనీపుత్రుడు. చూసిందే తడవుగా ఆ పండుని రుచి చూడాల్సిందే అని తీర్మానించుకున్నాడు. అంతే! వాయువేగంతో సూర్యుని వైపు దూసుకుపోయాడు. వాయుదేవునికి తన కుమారుని బాల్యచేష్టను చూసి ముచ్చట వేసిందే కానీ, అందులో ఉన్న ప్రమాదం గోచరించలేదు. అందుకనే ఆంజనేయుని చుట్టూ చల్లటి గాలులను వీస్తూ, అతనికి వేడి తగలకుండా కాచుకున్నాడు. పైగా ఆ రోజు సూర్యగ్రహణం. దాంతో సూర్యుని తీక్షణత సైతం తక్కువగా ఉంది.

ఒకవైపు నుంచి హనుమంతుడు సూర్యుని వైపు దూసుకుపోతుంటే, మరోవైపు నుంచీ సూర్యుని చెరపట్టేందుకు రాహువు పొంచుకు రాసాగాడు. కానీ హనుమంతుని చూసిన రాహువుకి మతిపోయింది. తాను సూర్యుని భక్షించేలోపే మరో రాహువు అందుకు సిద్ధపడటం ఏమిటి? అని కంగారుపడిపోయాడు. వెంటనే వెనుతిరిగి ఇంద్రలోకం వైపు పరుగులు తీశాడు. ‘స్వామీ ఇవాళ నేను సూర్యుని గ్రహించడం సాధ్యమయ్యేట్లు లేదు! మరో జీవి ఏదో సూర్యుని భక్షించేందుకు దూసుకువస్తోంది’ అంటూ మొరపెట్టుకున్నాడు.

రాహువు మాటలు విన్న ఇంద్రునికి పట్టరాని కోపం వచ్చింది. సృష్టిధర్మానికి విరుద్ధంగా, పంచభూతాలను సైతం తోసిరాజని ముంచుకొస్తున్న ఆ ప్రమాదాన్ని స్వయంగా ఎదుర్కోవాలనుకున్నాడు. వెంటనే తన వజ్రాయుధాన్ని చేతబూని, ఐరావతాన్ని అధిరోహించి ఆంజనేయుని ఎదుర్కొనేందుకు బయల్దేరాడు. కానీ ఇంద్రుని చూసి ఆగేవాడా ఆంజనేయుడు. పైగా ఆయన ఎక్కిన ఐరావతం కూడా ఒక మిఠాయిలాగానే కనిపించింది. వెంటనే దాన్ని అందుకోబోయాడు. ఇక ఇంద్రుని ఆగ్రహానికి హద్దులు లేకపోయాయి. అమితశక్తిమంతమైన తన వజ్రాయుధాన్ని ఆయన మీదకు విడిచాడు.

ఇంద్రుని వజ్రాయుధానికి తిరుగేముంది! అది నేరుగా ఆంజనేయుని దవడకు తగిలింది. ఆ దెబ్బతో ఆంజనేయుడు మూర్ఛిల్లాడు. కుమారుడి అవస్థ చూసిన వాయుదేవునికి చెప్పలేనంత ఆగ్రహం కలిగింది. వెంటనే ముల్లోకాల నుంచీ తన పవనాలను ఉపసంహరించుకున్నాడు. వాయువు లేక ప్రపంచం తల్లడిల్లిపోయింది. ఈ కల్లోలానికి కలవరపడి దేవతలంతా ఆంజనేయుని చెంతకు చేరుకున్నారు. బ్రహ్మ చేతి స్వర్శ తగలగానే ఆంజనేయుడు తిరిగి కోలుకున్నాడు. అదిగో అప్పటి నుంచీ ఆంజనేయుడు, హనుమంతుడు అన్న పేరుని సాధించాడు. ‘హను’ (దవడ) దెబ్బతిన్నది కనుక హనుమంతుడు అయ్యాడు. హనుమంతుడు అన్న పేరుకి కొందరు సర్వోన్నతుడనీ, మగ వానరుడు అనీ చెబుతారు కానీ... ఎక్కువ మంది అంగీకరించిన అర్థం మాత్రం- గాయపడిన దవడ కలిగినవాడు అనే!

ఆంజనేయుడు ఈ ఉపద్రవం నుంచి తేరుకోగానే అతనికి ఆశీర్వాదసూచకంగా దేవతలంతా తలా ఒక వరాన్నీ అందించారు. ఇకపై తన వల్ల మృత్యువు సంభవించదని యముడు ఆశీర్వదించాడు కాబట్టి ఆంజనేయుడు ‘చిరంజీవి’గా మారాడు. ఇంద్రుడు ఇకపై తన వజ్రాయుధం హనుమంతుని గాయపరచదు అన్న అభయాన్ని అందించాడు. అలాగే బ్రహ్మ కూడా తన బ్రహ్మాస్త్రం ఆంజనేయుని ఏమీ చేయజాలదన్న వరాన్ని అందించాడు. అలా అంజనేయుని సూర్యగ్రహణ ఘట్టం సుఖాంతమైంది. హనుమంతుడు అన్న పేరు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది.

- నిర్జర.

 


More Hanuman