కార్తీక మహా పురాణం తొమ్మిదోరోజు

  Karthika Puranam – 9

 ఉద్భూత పురుషునితో అంగీరసుడు ''నాయనా! ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలు చెప్తాను, విను.. అంటూ మొదలుపెట్టి ఆత్మజ్ఞాన బోధ చేశాడు.

కర్మబంధశ్చ ముక్తిశ్చ కార్యకారణమేవచ |

స్థూల సూక్ష్మం తాతా ద్వంద్వ సంబంధో దేహముచ్చతే ||

కర్మబంధం, ముక్తికార్యం, కారణం, స్థూల, సూక్ష్మం - ఈ ద్వంద్వ సంబంధమే దేహం.

అత్రబ్రూమస్సమాధానం కోన్యో జీవస్త్వ మేవహి |

స్వయం పృచ్చ సిమాంకో౭హం బ్రహ్మైవాస్మి న సంశయః ||

జీవుడంటే వేరెవరూ కాదు, నీవే. అప్పుడు ''నేనెవర్ని?'' అని నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటే ''నేనే బ్రహ్మ.. ఇది నిశ్చయం'' అనే సమాధానం వస్తుంది.

పురుష ఉవాచ:

''అంగీరసా! నువ్వు చెప్పిన వాక్యార్ధ జ్ఞానం నాకు తట్టడంలేదు. నేనే బ్రహ్మను అనుకోదానికైనా బ్రహ్మ అనే పదార్ధం గురించి తెలిసి ఉండాలి కదా! ఆ పదార్ధ జ్ఞానం కూడా లేని నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను''

అంగీరస ఉవాచ:

అన్తఃకరనానికి, తద్వ్యాపారాలకి, బుద్ధికి సాక్షి సత్, చిత్ ఆనందరూపీ అయిన పదార్ధమే ఆత్మ అని తెలుసుకో. దేహం కుండవలె రూపాదివత్గా ఉన్న పిండ శేషం, ఆకాశాది పంచభూతాల వల్ల పుట్టిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు. ఇలాగే ఇంద్రియాలు గానీ, అగోచరమైన మనసుగానీ అస్థిరమైన ప్రాణం గానీ ఇవేవీ కూడా ఆత్మ కాదని తెలుసుకో. దేనివలనైతే దేహము, ఇంద్రియాలు భాసమానం అవుతాయో అదే ఆత్మగా తెలుసుకుని, ఆ ఆత్మ పదార్ధమే నేను - అనే విచికిత్సను పొందు. ఎలాగైనా అయస్కాంతమణి తాను ఇతరాల చేత ఆకర్షింపబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అలాగే తాను నిర్వికారి అయి బుద్ధ్యాదులను సైతం చలింపచేస్తున్నదే దాన్ని ఆత్మవాచ్యమైన నేను గా గుర్తించు. దేని సాన్నిధ్యంవల్ల జడాలైన దేహెంద్రియ మనఃప్రాణులు భాసమానాలౌతాయో అదే జనన మరణ రహితమైన ఆత్మగా భావించు. ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాడులను, వాటి ఆద్యంతాలను గ్రహిస్తుందో అదే నేనుగా స్మరించు. ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటితమైనట్లే దేహేతరమై నేను అనబడే ఆత్మ చేతనే దేహాడులన్నీ భాసమానాలు అవుతాయి. అగోచర ప్రేమయే నేనుగా తెలుసుకో. దేహేంద్రియ మనః ప్రాణాహంకారాల కంటే విభిన్నమైంది, జనితత్వ అస్తిత్వ వృద్ధిగతత్వ, పరినామత్వ, క్షీణత్వ, నాశంగతతత్వాలానే షడ్వికారాలు లేని దానినే ఆత్మగా, అదే నువ్వుగా, ఆ నువ్వే నేనుగా, నేనే నీవుగా, ''త్వమేవాహం''గా భావించు.

ఇలా ''త్వం'' (నీను) అనే పదార్ధ జ్ఞానాన్ని పొంది, తత్కారణాత్ వ్యాపించే స్వాభావం వలన సాక్షాద్విధిముఖంగా తచ్చబ్దార్ధాన్ని గ్రహించాలి.

అతద్వ్యవృత్తిరూపేనా సాక్షాద్విధి ముఖేన చ |

వేదాంతానాం ప్రవృత్తి స్యాత్ ద్విరాచార్య సుభాషితం ||

అతః శబ్దానికి బ్రాహ్మణమైన ప్రపంచం అని అర్ధం. వ్యావ్రుట్టి అంటే ఇది కాదు, ఇదీ కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతిదాన్నీ కొట్టిపారేయడం అంటే ఈ చెయ్యి బ్రహ్మ (ఆత్మ) కాదు. ఈ కాలు ఆత్మ (బ్రహ్మ) కాదు... అనుకుంటూ ఇది కాకపొతే మరి అది ఏది - అని ప్రశ్నించుకుంటూ పోగాపోగా మిగిలేదే బ్రహ్మం (ఆత్మ) అని అర్ధం. ఇక సాక్షాత్ విదిముఖాత్ అంటే సత్యం జ్ఞానమనంతర బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత, జ్ఞానం, ఆనందాలవల్లే ఆత్మ నరయగల్గాలని అర్ధం. ఆ ఆత్మ సంసార లక్షణావేష్టితం కాదని, సత్యమని, దృషిగోచరం కాదని, చీకటిని ఎరుగనిదని, లేదా చీకటికి అవతలిదని, పోల్చి చెప్పడానికి వీలు లేనంతటి ఆనందమయమని, సత్య ప్రజ్ఞాది లక్షణయుతమని, పరిపూర్ణమణి పూర్వోక్త సాధనల వలన తెలుసుకో''

దేనినైతే ''సర్వజ్ఞం పరేశం సంపూర్ణ శక్తిమంతం''గా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు. ఏం తెలుసుకుంటే అన్నీ తెలిసిపోతాయో, అదే ఆత్మ. అదే నువ్వు. అదే నేను. ''తదనుప్రవిశ్య'' ఇత్యాది వాక్యాలచేత జీవాత్మరూపాన జగత్ప్రవేశమూ ప్రవేశిత జీవులను గురించిన నియమ్త్రుత్వము, కర్మ ఫలప్రదత్వము, సర్వజీవ కారణ కర్తృత్వము - దేనికైతే చెప్పబడుతూ ఉందో అదో బ్రహ్మగా తెలుసుకో. తత్త్వమసి తత్ అంటే బ్రహ్మ, లేదా ఆత్మ. త్వం అంటే నువ్వే. అంటే పరబ్రహ్మమణి అర్ధం. ఓ జిజ్ఞాసూ! అద్వయానంద పరమాత్మయే ప్రత్యగాత్మ. ఈ ప్రత్యగాత్మయే ఆ పరమాత్మ. ఈ ప్రకారమైన తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ సబ్దార్ధం తనేనని, త్వం శబ్దం సాధనమే గానీ ఇతరం కాదని తేలిపోతుంది. నీకు మరింత స్పష్టంగా అర్ధమవడం కోసం చెప్తున్నాను, విను.

తత్వమసి - వాక్యానికి అర్ధం తాదాత్మ్యము అనే చెప్పాలి. ఇందులో వాక్యార్దాలైన కించిజ్ఞత్వ, సర్వజ్ఞతా విసిష్టులైన జీవేశ్వరులను పక్కనపెట్టి లక్ష్యార్దాలైన ఆత్మలనే గ్రహించినట్లయితే ''తాదాత్మ్యం'' సిద్ధిస్తుంది.

అహం బ్రహ్మా౭స్మి అనే వాక్యార్ధ బోధ స్థిరపడేవరకూ కూడా శమ దమాది సాధన సంపత్తితో శ్రవణమనదికాలను ఆచరించాలి. ఎప్పుడైతే శృతివల్లనో, గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో అప్పుడీ వర్తమాన సంసార లంపటం దానికదే పుటుక్కున తెగిపోతుంది. అయినా కొంతకాలం ప్రారబ్దకర్మ పీడిస్తూనే ఉంటుంది. అది కూడా క్షయమవడంతో పునరావృత రహితంగా స్థాయిని చేరతాం. దాన్నే ముక్తి, మోక్షం అంటారు. అందువల్ల ముందుగా చిత్తశుద్ది కోసం కర్మిష్టులుగా ఉండి, తత్ఫలాన్ని దైవార్పణం చేస్తూ ఉండటం వల్ల ప్రారబ్దాన్ని అనుసరించి ఆ జన్మలోగానీ లేదా ప్రారబ్ధ కర్మ ఫలం అధికమైతే మరుజన్మలో నైనా వివిధ మోక్ష విద్యాభ్యాసపరులై, జ్ఞానులై, కర్మబంధాల్ని తెంచుకుని ముక్తులౌటారు. నాయనా! బంధించేవి ఫలవాంఛిత కర్మలు, ముక్తినిచ్చేవి ఫలపరిత్యాగ కర్మలు'' - అంటూ ఆపాడు అంగీరసుడు.

అప్పుడు ఉద్భూత పురుషుడు కర్మయోగాన్ని గురించి అడగ్గా అంగీరసుడు తిరిగి ఇలా చెప్పసాగాడు.

మంచి విషయాన్ని అడిగావు. శ్రద్ధగా విను. సుఖ దుఖాది ద్వంద్వాదులన్నీ దేహానికే గానీ, తదతీతమైన ఆత్మకు లేవు. ఎవడైతే ఆత్మానాత్మ సంశయగ్రస్తుడో వాడూ మాత్రమే కర్మలను చేసి తద్వారా చిత్తశుద్ధి పొంది, ఆత్మజ్ఞాని కావాలి. దేహదారి అయినవాడూ తన వర్ణాశ్రమ విద్యుక్తాలైన స్నానశౌచాదిక కర్మలను తప్పనిసరిగా చేసితీరాలి.

స్నానేన రహితం కర్మ హస్తిభుక్త కపిత్థవత్ |

ప్రాతః స్నానం ద్విజాతీనాం శాస్త్రం చ శృతిచోదితం ||

స్నాన రహితంగా చేసే ఏ కర్మ అయినా సరే ఏనుగు తిన్న వెలగపండుళా నిష్ఫలమే అవుతుంది. అయినా బ్రాహ్మణులకు ప్రాతః స్నానం వేదోక్తమై ఉంది. ప్రతిరోజూ ప్రాతః స్నానం చేయలేనివాళ్ళు సూర్యసంచారం గల తులా-కార్తీక, మకర-మాఘ, మేష-వైశాఖాలలో అయినా చేయాలి. జీవితంలో ఈ మూడు మాసాలైనా ప్రాతః స్నానాలు చేసేవారు తిన్నగా వైకుంఠాన్నే చేరతారు. చాతుర్మాస్యాది పుణ్యకాలాల్లో సర్వ ప్రజలకు స్నాన సంధ్యా జప హోమ సూర్య నమస్కారాలు తప్పనిసరిగా చేయవలసి ఉన్నాయి. స్నానాన్ని వదిలినవారు రౌరవ నరకంచేరి పునః కర్మభ్రష్టులుగా జన్మిస్తారు.

ఓ వివేకవంతుడా! పుణ్యకాలాలూ అన్నింటా సర్వోత్తమం అయినది కార్తీకమాసం. వేదాన్ని మించిన శాస్త్రం, గంగను మించిన తీర్థం, భార్యను మించిన సుఖం, ధర్మతుల్యమైన స్నేహం, కంటికంటే వెలుగు లేనట్లుగానే కార్తీకమాసంతో సమానమైన పుణ్యకాలం గానీ కార్తీక దామోదరునికన్నా దైవం గానీ లేడని గుర్తించు. కర్మ మర్మాన్ని తెలుసుకుని కార్తీకంలో ధర్మాన్ని ఆచరించేవాడూ వైకుంఠం చేరతాడు.

నాయనా! విష్ణువు లక్ష్మీసమేతుడై, ఆషాఢశుక్ల దశమి అంతంలో పాలసముద్రాన్ని చేరి నిద్రా మిషతో శయనిస్తాడు. తిరిగి హరిబోధినీ అని పిలుచుకునే కార్తీక శుక్ల ద్వాదశినాడు నిద్ర లేస్తాడు. ఈ నడుమ నాలుగు మాసాలనే చాతుర్మాస్యం అంటారు.

విష్ణువుకు నిద్రాసుఖప్రదమైన ఈ నాలుగు నెలలూ కూడా ఎవరైతే హరి ధ్యానము, పూజలు చేస్తుంటారో వాళ్ళ పుణ్యాలు అనంతమై, విష్ణులోకాన్ని పొందుతారు. ఈ విషయమై ఒక పురాణ రహస్యాన్ని చెప్తాను.

కృతయుగంలో ఒకసారి విష్ణువు లక్ష్మీదేవితో కలిసి వైకుంఠ సింహాసనాన్ని అలంకరించి ఉండగా నారదుడు వెళ్ళి నమస్కరింఛి ''శ్రీహరీ! భూలోకంలో వేదవిధులు అడుగంటాయి. జ్ఞానులు సైతం సుఖాలకు లాలసులు అవుతున్నారు. ప్రజలంతా వికర్ములై ఉన్నారు. వారెలా విముక్తులౌతారో తెలీక బాధగా ఉంది'' అన్నాడు.

నారదుని మాటలు విన్న నారాయణుడు సతీసమేతుడై, వృద్ధ బ్రాహ్మణ రూపధారి అయి తీర్ధక్షేత్రాదుల్లో, బ్రాహ్మణ

పరిషట్పట్టణాల్లో పర్యటించసాగాడు. కొందరు ఆ దంపతులకు అతిథి సత్కారాలు చేశారు. కొందరు హేళన చేశారు. ఇంకొందరు లక్ష్మీనారాయణ ప్రతిమలను పూజిస్తూ వీళ్ళను తిరస్కరించారు. కొందరు అభక్ష్యాలను పాపాచరణులను చూసిన శ్రీహరి ప్రజోద్ధరణ చింతనా మానసుడై చతుర్భుజాలతో, కౌస్తుభాది ఆభరణాలతో యధారూపాన్ని పొంది ఉండగా జ్ఞానసిద్ధుడనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆరాధించాడు. అనేక విధాలుగా స్తుతించాడు.-

Hindu Calender Month Karthik masa, Karthika Puranam Epic, Moksha with Karthika Puranam Epic, Karthika Puranam Stories in Telugu

 


More Festivals