పగ మాసిపోదు

కురుక్షేత్ర సంగ్రామం తర్వాత అంపశయ్య మీద ఉన్న భీష్ముడు, ధర్మరాజుకి రకరకాల ఉపదేశాలు చేశాడు. లౌక్యం గురించీ, రాజ్యపాలన గురించీ చేసిన ఈ ఉపదేశాలు... కాలం మారినా విలువని మాత్రం కోల్పోలేదు. వాటిలో స్నేహపు పరిమితుల గురించీ, పగ వలన పొంచి ఉండే ప్రమాదం గురించీ చెప్పిన ఓ చిలుక కథ మనకి విలువైన పాఠాలనెన్నో నేర్పుతుంది.

‘‘ధర్మారాజా! అనగనగా బ్రహ్మదత్తుడు అనే రాజు ఉండేవాడు,’’ అంటూ తన కథని మొదలుపెట్టాడు భీష్ముడు- ఆ బ్రహ్మదత్తునికి ఓ చిలుక మీద అభిమానం ఏర్పడింది. ఆ అభిమానం కాస్తా స్నేహంగా పరిణమించింది. చిలుక బ్రహ్మదత్తునికి సమీపంలోనే నివసిస్తూ ఉండేది. ఇలా కాలం సాగుతుండగా ఆ చిలుకకి ఒక కుమారుడు కలిగాడు. ఆ చిన్ని చిలుకతో బ్రహ్మదత్తుని కుమారుడు ఆడుకుంటూ ఉండేవాడు.

ఒకరోజు చిట్టి చిలుకతో ఆటలాడుతున్న రాజకుమారుడికి ఎందుకో దాని మీద కోపం వచ్చింది. అంతే! అమాంతం దానిని చిదిమివేశాడు. ఆ దృశ్యాన్ని చూసిన చిలుక కోపాన్ని అణచుకోలేకపోయింది. వెంటనే తన వాడి గోళ్లతో అతని కళ్లని పొడిచిపారేసింది. దాంతో రాజకుమారుడు కాస్తా గుడ్డివాడు అయిపోయాడు. చిలుక అంతటితో ఆగలేదు. నేరుగా రాజు దగ్గరకు వెళ్లి- ‘రాజా! నీ కుమారుడు నా కొడుకుని చంపి తప్పు చేశాడు. అందుకు ప్రతిఫలంగా నేను అతణ్ని గుడ్డివాడిని చేశాను. ఇందులో నా తప్పేమీ లేదు. అయినా ఇకమీదట నేను ఇక్కడ ఉండలేను. సెలవు!’ అని చెప్పింది.

చిలుక మాటలు విన్న రాజు ‘నువ్వన్నది నిజమే! జరిగినదానిలో నీ తప్పేమీ లేదు. రాజకుమారుడు నీ కొడుకుకి హాని తలపెట్టాడు కాబట్టి ఫలితాన్ని అనుభవించక తప్పలేదు. మరి అలాంటప్పుడు నన్ను వదిలి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? జరిగినదేదో జరిగిపోయింది. దయచేసి ఇకమీదట కూడా నాతో స్నేహంగా ఉండు,’ అంటూ అర్థించాడు.

‘రాజా! నేను నీ కుమారుడిని గుడ్డివాడిగా మార్చేశాను. కాబట్టి నీలో నా మీద పగ ఏర్పడి తీరుతుంది. పగ నాలుగు రకాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఇతరుల భూమిని చేజిక్కించుకోవడం వల్ల, అన్నదమ్ముల మధ్య ఆస్తితగాదాల వల్ల, ఆడవారి మధ్య మాటామాటా పెరగడం వల్ల, ఎదుటివారి మనసుని గాయపరచడం వల్ల పగ ప్రబలుతుంది. అలాంటి ప్రతికూల భావాలు ఒకసారి మొదలైతే, ఇక వాటికి అంతమంటూ ఉండదు. అలాంటి విద్వేషకరమైన వాతావరణంలో ఎవ్వరినీ నమ్మడానికి లేదు. నేను నీ కొడుకుకి హాని తలపెట్టాను కనుక నీలో నా మీద విద్వేషం మొదలయ్యే ఉంటుంది. కాబట్టి నీ తీయని మాటలని విని నేను ఇక్కడ ఉండలేను,’ అంటూ తుర్రుమంది చిలుక.‘‘కాబట్టి ఓ ధర్మరాజా! రాజనేవాడు ఆ చిలుకలాగా తన జాగ్రత్తలో తనుండాలి. తన రాజ్యంలో ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు. సుతిమెత్తగా మాట్లాడుతున్నట్లు కనిపించాలే కానీ మనసు మాత్రం దృఢంగా ఉండాలి. అందరినీ నమ్మినట్లు ఉండాలి కానీ తన జాగ్రత్తలో తనుండాలి. ఎవరితోనూ హద్దులు దాటి చనువుగా మెలగకూడదు. వ్యసనాలలో పడి విచక్షణను మర్చిపోకూడదు. అనుకున్న కార్యం పూర్తయ్యేదాకా, రహస్యాన్ని బట్టబయలు చేయకూడదు. అంతేకాదు! పూర్తిగా తీరని రుణం, పూర్తిగా ఆరని మంట, పూర్తిగా చల్లారని పగ... ఈ మూడింటి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి ఎప్పుడైనా ప్రాణాంతకంగా పరిణమించగలవు’’ అంటూ ముగించాడు భీష్ముడు.

- నిర్జర.


More Purana Patralu - Mythological Stories