" శబ్దాల మీద నగిషీలు "
ఆచార్య తిరుమల
అడిగేవాడికి చెప్పేవాడు లోకువని సామెత.
అడిగేవాడు ఏది పడితే అది ఎలా పడితే అలా అడగొచ్చు కానీ చెప్పేవాడు మాత్రం ఏది పడితే అది ఎలా పడితే అలా సమాధానంగా చెప్పటానికి వీల్లేదు. తలతిక్క ప్రశ్నలకు కూడా తలకెక్కే సమాధానాలు చెప్పాలి.
ఆ బాధ్యతని బలహీనతగా భావించటం వల్ల లోకువగా కనిపించవచ్చును.కానీ మళ్ళీ నోరెత్త లేని సమాధాన మిచ్చేవాడికి అడిగేవాడు లోకువే కాదు
సరికదా...జీవితాంతం దాసుడు కూడా అవుతాడు.
లోకంలో చాలా రకాల మనుషులు ఉంటారు.కొందరు ఏదోటి అడుగుతూనే వుంటారు.కానీ ఏమి తెలుసుకోరు.కొందరు ఎవ్వరూ ఏమి అడక్కపోయినా ఏదోటి చెప్తూనే వుంటారు కానీ అవతలి వారు వింటున్నారా లేదా అని కూడా పట్టించుకోరు.కొందరు అన్నీ తమకే తెలిసున్నట్టు ఏమి అడగరు.
కొందరు ఎంత తెలుసుకుందామని అడిగినా చెప్పరు.కొందరు అడిగి అడగనట్టు అడుగుతూ వుంటారు.కొందరు చెప్పీ చెప్పనట్టు వుంటారు. ఎవరు ఎలా ఉన్నా అడిగేవాడికి చెప్పేవాడికి కొన్ని కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయని గ్రహించడం మంచిది.అడిగే విధానమెలా వున్నా చెప్పేమాట హృదయానికి హత్తుకోవాలంటే, మనోరంజకంగా వుండాలంటే...అది సత్యబద్ధమై అందంగా ఉండాలి.
.png)
ఈ విషయాన్ని మనుధర్మశాస్త్రం మహా చమత్కారంగా ఇలా చెప్పింది.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్
న బ్రూయాత్ సత్య మప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్
ఏష ధర్మ స్సనాతన:!!
సత్యాన్నే పలుకు,ప్రియాన్నే మాట్లాడు సత్యమైనా ఆప్రియాన్నిపలక్కు,ఇదే సనాతన ధర్మం అని శ్లోక తాత్పర్యం.
ఇది చెప్పేవాడికి చెప్పే లక్షణ శ్లోకంలా కనిపిస్తుంది.కానీ అడిగే వాడెలాంటి విషయం
వింటానికి అడగాలో,ఏది వినాలో చెప్పే చమత్కారం కూడా యిందులో వుంది.
సత్యాన్నేవిను,ప్రియమైన దాన్నే విను.సత్యమైనా అప్రియంగా వుంటే వినకు.అలాగే ప్రియంగా వుందని అసత్యాన్ని వినకు.అలాంటి లక్షణాలతో చెప్పేవాడు.
వినేవాడూ వున్నప్పుడు ఆ చెప్పిన విషయం హృదయానికి హత్తుకుని ఎల్ల కాలం గుర్తుంటుంది.
|
|