మల్లన్న(విక్రమ్) ఒక సిన్సియర్ ఐపియస్ ఆఫీసర్. అతను సిబి.ఐ.ఆర్థికనేరాల విభాగంలో పనిచేస్తుంటాడు. వారి ఛీఫ్ (కృష్ణ) మల్లన్నకు బాగా సహకరిస్తుంటాడు. ఇదిలా ఉంటే సనాతనంగా మల్లన్న స్వామి దేవాలయంలో మన కోరికను ఒక చీటీలో వ్రాసి అక్కడున్న చెట్టుకి కడితే, ఆ స్వామి ఆ కోరికను తీరుస్తాడనే నానుడి ఉంది. ఒకతనికి ఆరోగ్యం బాగు చేయాలంటే అందుకు అరవై వేలు అవసరమవుతాయి. అతనిది నిరుపేద కుటుంబం అవటంతో, అతని భార్య తన భర్త ప్రాణాలు కాపాడటనికి అవసరమైన 60 వేలు ఇవ్వాలని మల్లన్నను కోరుతూ చీటీ వ్రాసి అక్కడున్న చెట్టుకి కడుతుంది. తెల్లవారి ఆమె ఇంటి ముందు 60 వేల డబ్బు మూట ఉంటుంది. కానీ ఆ ధనాన్ని అక్కడున్న పోలీసాఫీసర్ కొట్టేస్తే, ఆ రాత్రి కోడిరూపంలో వచ్చి అతన్ని తన్ని, ఆ డబ్బుని ఆమెకు అందజేస్తాడు మల్లన్న. ఈ విషయం బయటకు తెలియటంతో జనం తండోపతండాలుగా వచ్చి తమ కోరికలను చీటీలో వ్రాసి అక్కడున్న చెట్టుకి కడుతూంటారు. ఇది నమ్మని ఒక పోలీసాఫీసర్ పరంధామ్ (ప్రభు) ఇదేంటో తెలుసుకోటానికి ప్రయత్నిస్తుంటాడు.
మల్లన్న ఒకసారి వెయ్యి కోట్లు ప్రభుత్వం సొమ్ము దోచిన పిపిపి అంటే పల్నాటి పరంజ్యోతి పుణ్యమూర్తి (ఆశిష్ విద్యార్థి) అనే వ్యక్తి ఇంటి మీద అఫీషియల్గా దాడి చేస్తాడు. ఆ దాడిలో ఊహించనంత ధనం దొరుకుతుంది. కానీ అతనికి పక్షవాతం రావటంతో అందుకు కారణమైన మల్లన్న మీద పగబడుతుంది అతని కూతురు సుబ్బలక్ష్మి (శ్రియ). అతన్ని అతని ఆఫీసులో అవమానింపబోయి భంగపడుతుంది. అతన్ని ప్రేమిస్తున్నట్లు నటించి అతని మీద పగతీర్చుకోవాలనుకుంటుంది. పరంధామ్ తన ప్రయత్నంలో ముందుకు సాగుతుంటాడు. రాజ్ మోహన్ (ముఖేష్ తివారి) అనే అత్యంత ధనవంతుణ్ణి మల్లన్న తనకు ఉద్యోగం రాకముందు ఒక సందర్భంలో కొడతాడు. ఈ రాజ్ మోహన్, పిపిపి కలసి మల్లన్నే దేవుడు మల్లన్నగా పేదలకు సాయం చేస్తున్నాడని తెలుసుకుని, అతన్ని డ్యూప్లికేట్ స్పేషల్ బ్రాంచ్ ఆఫీసర్లని పంపి బంధించి, అతనిచేత తానే ఇలా చేస్తున్నానని చెప్పించి కెమెరాలో రికార్డ్ చేస్తారు. అలా చెప్పిన మల్లన్నతో వాళ్ళు బేరం ఆడతారు. మల్లన్న దోచే డబ్బులో సగం వాళ్ళకివ్వాలనీ లేకుంటే ఆ రికార్డ్ చేసిన కేసెట్ పరంధామ్ కి ఇస్తామన్నదే ఆ బేరం. ఈ దిశలో మెక్సికోలో చాలా పెద్ద మొత్తంలో ధనం చేతికొస్తుందనీ, ప్రభుత్వానికి తెలియకుండా అక్కడికి వెళ్ళాలనీ పిపిపి ని కోరతాడు మల్లన్న. మల్లన్నతో పాటు తన కూతురు సుబ్బలక్ష్మిని కూడా పంపుతాడు పిపిపి. అక్కడ మల్లన్నని చంపే ఏర్పాటుచేస్తాడు పిపిపి. మల్లన్న అక్కడి నుండి తప్పించుకున్నాడా...? పరంధామ్ అతన్ని పట్టుకున్నాడా..? రాజ్ మోహన్, పిపిపిలు ప్రభుత్వానికి దొరుకుతారా...? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి.
Analysis
దర్శకుడు సుశి గణేషన్ టేకింగ్కీ, బిల్డప్ షాట్లకీ ఇచ్చిన ప్రాథాన్యత, కథనానికిచ్చి ఉంటే ఈ సినిమా మరింత బాగుండేది. స్క్రీన్ప్లే బాగా బలహీనంగా ఉండటం, ఇంకా ఒక అరగంటకు పైగా ఈ చిత్రాన్ని ట్రిమ్ చేయవలసి ఉండటం వల్ల ఈ చిత్రం బాగా స్లోగా నడుస్తున్నట్లనిపిస్తుంది.ఇక మల్లన్న పాత్ర ఎంట్రెన్స్ ఆశించ్చిన స్థాయిలో లేదు. మల్లన్న కోడి రూపంలో ఎలా పైకెగురుతాడో, శతృవులతో ఎలా పోరాడుతాడో, ఆ పోరాటంలో తన మిత్రుల సాయం ఎలా తీసుకుంటాడో చూపించిన విధానం చిన్నపిల్లల చేష్టలలాగ ఉంది. అతని అనుభవ రాహిత్యం ఈ చిత్రంలో అణువణువునా కొట్టొచ్చినట్టు కనపడుతూంది. కళైపులి థాను వంటి ఖర్చుకి వెనుకాడని నిర్మాత, విక్రమ్ వంటి అద్భుతమైన నటుణ్ణి చేతిలో ఉన్నప్పుడు, 50 కోట్ల భారీ బడ్జెట్తో, అయిదు దేశాల్లో, అయిదు భాషల్లో, రెండు సంవత్సరాల సమయంలో తీసిన సినిమా ఏ స్థాయిలో ఉండాలో ఈ సినిమా ఆ స్థాయిలో లేకపోవటం దురదృష్టకరం. తొలి చిత్రానికే ఇలాంటి అవకాశం రావటం చాలా అదృష్టం. కానీ దర్శకుడు దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం బాధాకరం.
TeluguOne Perspective
నటన -: విక్రమ్ తన వరకూ తాను చక్కగా నటించాడు. నథింగ్ స్పేషల్. ఇక శ్రియ ఈ సినిమాలో రెచ్చిపోయిందనే చెప్పాలి. శ్రియ ఈ సినిమాలో వీలయినంత ఎక్స్ పోజింగ్ చేసింది. మిగిలిన వారంతా వారి వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.
సంగీతం-: దేవీశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. పాటలన్నీ బాగున్నా "మియావ్ మియావ్ పిల్లి ఇది మీసాల్లేని పిల్లి" అనే పాట, "ఎక్స్ క్యూజ్మి మిస్టర్ మల్లన్న" పాటలు బాగున్నాయి. రీ-రికార్డింగ్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ-: చాలా బాగుంది. ఫొటోగ్రఫీ పాటల్లో ఇంకా బాగుంది. ఈ సినిమాకి సగం దర్శకత్వం వహించింది సినిమాటోగ్రాఫర్ అనిపిస్తుంది ఈ చిత్రం చూస్తుంటే. ఎడిటింగ్-: ఇంకా చాలా ఎడిటింగ్ చేయాలి. ఆర్ట్-: బాగుంది. యాక్షన్-: డీసెంట్గా ఉంది. కొత్త తరహాలో ఉంది.
ఈ సినిమాని భారీగా "అపరిచితుడు" రేంజ్లో ఊహించుకుని వెళ్తే నిరాశ తప్పదు. ఏ అంచనాలు లేకుండా వెళ్తే ఒకసారి చుడొచ్చు. Mallana in TeluguOne