మనిషిగా జన్మించినందుకు ఆ జన్మ సార్థకం చేసుకుని,జీవితంలో ఏదైనా సాధించగలిగేది మాత్రం కొందరే.వాళ్ళు నూటికో కోటికో ఒక్కరుంటారు.అలాంటి వారిలో సంగీత సరస్వతి ముద్దుబిడ్ద,సార్థక జన్ముడే కాక సార్థక నామధేయుడు కూడా అయిన యమ్.యమ్.కీరవాణి ఒకరు.యమ్ యమ్ కీరవాణి అంటే ఆయన పూర్తి పేరు మరకత మణి కీరవాణి.పేరుకి తగ్గట్టే ఆయన ఒక మరకతమణి వంటి వారేనంటే అతిశయోక్తి కాదు.ఆయన తెలుగు ,తమిళం ,కన్నడం ,మళయాళం ,హిందీ భాషల్లో ఇప్పటివరకూ మొత్తం 200 చిత్రాలకు పైగా సంగీతం అందించారు.ఆయన సంగీతంలో పలకని భావం లేదు,వినపడని రాగం లేదు.ఏ సందర్భానికి తగినట్టు ఆయా రాగాలు ఆయన స్వరకల్పనలో పరిమళిస్తాయి.అన్నమయ్య చిత్రానికి జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డునందుకున్న కీరవాణి మన తెలుగువాడైనందుకు గర్వపడాలి.
మాతృదేవత చిత్రంలో "రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే","వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి", "వేణు మాధవా","జామురాతిరి జాబిలమ్మ", "తెలుసా మనసా ఇది ఏజన్మ సంబంధమో"అన్న పాటల వంటి మెలొడీలైనా,"నువ్విజిలేస్తే ఆంధ్రా సోడా బుడ్డి","బంగారు కోడిపెట్ట వచ్చెనండీ ఓ పాప ఓ పాప ఓ పాపా"అన్న మాస్ సాంగైనా ఆయనకు కరతలామలకం.ఈ "బంగారు కోడి పెట్ట"అనే పాటను ఆయన మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రానికి కంపోజ్ చేశారు. ప్రస్తుతం ఆయన కుమారుడు రామ్ చరణ్ తేజ హీరోగా నటించిన "మగధీర" చిత్రంలో కూడా అదే పాటను రీమిక్స్ చేసిన ఘనత ఒక్క కీరవాణికే దక్కింది.కీరవాణి సంగీత దర్శకుడు మాత్రమే కాదు.ఆయన స్వయంగా చక్కని గాయకుడు,గేయ రచయిత కూడా.ఇటీవల ఆయన సంగీత దర్శకత్వంలో విడుదలైన "వేదం"చిత్రంలో "ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ"అన్న పాటను కీరవాణే స్వయంగా వ్రాసి స్వరపరచారు.
1990వ సంవత్సరంలో "మనసు- మమత" అనే చిత్రానికి సంగీతం అందించటంతో ఆయన సంగీత ప్రస్థానం మొదలై, నేటి "మర్యాదరామన్న"చిత్రం వరకు ఆయన సంగీత ఝరి అనంతంగా సాగుతూనే ఉంది.ఉదాహరణకు ఆయన సంగీత దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాలను చూద్దాం."సీతారామయ్యగారి మనవరాలు,క్షణం క్షణం,సుందరాకాండ,ఘరానా మొగుడు,ఘరానా బుల్లోడు, అల్లరి ప్రియుడు, అల్లరి బుల్లోడు, అల్లరి మొగుడు, అల్లరి ప్రేమికుడు, ప్రెసిడెంటుగారి పెళ్ళాం, ఆపద్భాంధవుడు, శుభసంకల్పం, పెళ్ళి సందడి,స్టూడెంట్ నంబర్ 1,నేనున్నాను,అనగనగా ఒక రోజు,ఛత్రపతి,యమదొంగ,విక్రమార్కుడు,మగధీర,వేదం, ఝుమ్మంది నాదం" వంటి చిత్రాల్లోని ఆయన సంగీతం ఆయా చిత్రాలు హిట్టవటానికి ఎంతబాగా దోహదపడ్డాయో మనందరికీ తెలిసిన విషయమే.
ఇక హిందీలో ఆయన "ఇస్ రాత్ కి సుభాహ్ నహీ,సుర్,జఖ్మ్,సాయా,క్రిమినల్,రోగ్,పహేలి వంటి అనేక చిత్రాలకు సంగీతం అందించారు.మళయాళంలో "నీలగిరి,దేవరాగం,సూర్యమానసం"వంటి చిత్రాలకు ఆయన సంగీతం అందించగా,ఆ యా చిత్రాల్లోని సంగీతం అక్కడి విమర్శకుల ప్రశంసలు పొందటం విశేషం. 1992లో "రాజేశ్వరి కళ్యాణం" చిత్రానికి, 1993లో "అల్లరి ప్రియుడు" చిత్రానికి,1995లో "పెళ్ళిసందడి"చిత్రానికి 2002లో "ఒకటో నంబరు కుర్రాడు" చిత్రానికి, 2005లో "ఛత్రపతి" చిత్రానికి ఆయన అందించిన సంగీతానికి గాను ఆయనకు మన రాష్ట్ర ప్రభుత్వం నంది బహుమతులనిచ్చి గౌరవించింది.ఇక 1998 వ సంవత్సరంలో "అన్నమయ్య" చిత్రానికి కీరవాణి అందించిన సంగీతానికి మన భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డునందించింది.
ప్రముఖ యువ దర్శకుడు రాజమౌళి ఆయనకు కజిన్ అవుతాడు.ఇక ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్,యమ్.యమ్.శ్రీలేఖ ఆయనకు సోదర సోదరీమణులు కావటం,ఆయన భార్య శ్రీమతి శ్రీవల్లి వేల్ రికార్డ్స్ అనే ఆడియో సంస్థను స్థాపించి సినీ సంగీతాన్ని మార్కెట్ చేయటంలో సినీ పరిశ్రమకు చాలా ఉపయోగకారిగా ఉన్నారు.ఈ విధంగా ఆయన కుటుంబమంతా సినీ పరిశ్రమకు ఏదో విధంగా అంకితమై ఉండటం గమనార్హం.అటువంటి చక్కని సంగీత దర్శకులు కీరవాణి గారి జన్మదినం జూలై నాలుగవ తేదీ.ఈ సందర్భంగా ఆయన మరిన్ని మంచి చిత్రాలకు మరింత మంచి సంగీతాన్నందించాలని ఆశిస్తూ ఆయనకు తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.