జూన్ నాలుగవ తేదీ, 1946 లో నెల్లూరు జిల్లాలో, హరికథలు చెప్పే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తిగారికి రెండో అబ్బాయి పుట్టాడు.అందరిలాగే ఈ పిల్లాడు కూడా చక్కగా చదువుకుంటూ ఉంటే చూసి అతని తండ్రి అతన్ని ఇంజనీర్ని చేద్దామనుకున్నారు. కానీ సంగీత సరస్వతీ కటాక్షం పరిపూర్ణంగా ఉన్న ఆ పిల్లాడు ఇంజనిర్ ఎలా అవుతాడు. గానగంధర్వ్యుడుగా మారాడు. అతనే శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఈ రోజున సుమారు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, మరాఠీ, ఒడిస్సీ, బెంగాలీ భాషల్లో 45 వేలకు పైగా పాటలు పాడినా కూడా ఇంకా అవిశ్రాంతంగా పాడుతునే ఉన్న గాత్రం సంగీత సముద్రం కాక మరేమిటి. ఒకరికా... ఇద్దరికా... ఏంతో మంది హీరోలకు, కమెడియన్లకూ, ఇంకెందో మంది నటులకు ఆయన గాత్ర దానం చేశారు. ఆయన కీర్తిశేషులు యన్టిఆర్ కి పాడితే అచ్చంగా ఆయన పాడినట్లే ఉంటుంది. అదే అక్కినేని నాగేశ్వరరావుకి పాడితే నిజంగా ఆయనే పాడినట్లుంటుంది. అలాగే కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలకు, అల్లు రామలింగయ్య, రాజబాబు, సుత్తివేలు, వంటి హాస్యనటులకూ పాడిన బాలు వారి గాత్రాన్ని ఇమిటేట్ చేస్తూ అలాగే పాడేవారు. ఆయన 1966 లో డిసెంబర్ 15 వ తేదీన, సీనియర్ నటులు పద్మనాభం నిర్మించిన "శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న" చిత్రంలో యస్.పి. కోదండపాణి సంగీత దర్శకత్వంలో తొలి పాట పాడారు. ఆ నాటి నుంచి నేటి వరకు ఆయన గాత్రం నిర్విరామంగా సంగీత తరంగాలు ప్రవహిస్తూనే ఉంది. ఒకే రోజున తమిళంలో 19 పాటలు, ఉదయం 9 నుండి రాత్రి 9 వరకు కన్నడంలో 17 పాటలు పాడి గిన్నీస్ బుక్ లో తన పేరు నమోదుచేసుకున్నారు బాలు. ఇక ఆయన్ని వరించిన అవార్డులు, రివార్డులకు అంతే లేదు. ఈ రోజుకీ ఆయనకు సన్మానాలూ, సత్కారాలూ జరుగుతూనే ఉంటాయి. 1999లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం వారు ఒక గౌరవ డాక్టరేట్నివ్వగా, తమిళనాడులోని సత్యభామ యూనివర్సిటి వారు 2009లో మరో గౌరవ డాక్టరేట్నిచ్చి సత్కరించారు. 1979లో శంకరాభరణం చిత్రానికి పాడినందుకు, హిందీ చిత్రం "ఏక్ దుజే కే లియే" చిత్రంలో పాడినందుకు, 1983లో సాగర సంగమం చిత్రంలో పాడినందుకు, 1988లో రుద్రవీణలో పాడినందుకు, 1995లో ఒక కన్నడ చిత్రంలో పాడినందుకూ, 1996లో ఒక తమిళ చిత్రం "మీన్సార కణవు"లో పాడినందుకు గాను ఆయనకు జాతీయ అవార్డులు లభించాయి. ఆయన పాడిన పాటల్లో "శివరంజని.. నవరాగిణి, నేనొక ప్రేమ పిపాసినీ, మల్లికా నవమల్లికా, అభినవతారవో నా అభిమాన తారవో, తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో'' వంటి అనేక ఆణిముత్యాలున్నాయి. ఇక దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన "కన్యా-కుమారి" సంగీత దర్శకుడిగా బాలు తొలి చిత్రం.ఆ తర్వాత బాపుగారి "తూర్పు వెళ్ళే రైలు"వంటి అనేక చిత్రాలకు బాలు సంగీతం అందించారు. అంతేకాదు ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సకల కళా వల్లభుడు పద్మశ్రీ, డాక్టర్ కమల్ హాసన్ నటించిన చాలా చిత్రాలకు తెలుగులో గాత్రం అందించారు బాలు. అంతే కాకుండా తాను పాడటం నుంచి దాదాపు తప్పుకున్నంత పనిచేసి కొత్త టాలెంట్ని వెలికి తీసే ప్రయత్నంలో అనేక ఛానళ్ళలో అనేక సంగీత కార్యక్రమాలను నిర్వహించిన ఘనులు బాలు. 40యేళ్ళుగా పాడుతున్నా కూడా "బాలూ - ఇక చాలు" అనిపించుకోకుండా, బాలు ఇంకా పాడు అనిపించుకోవటం ఒక్క బాలసుబ్రమణ్యంకే సాటి. బాలు గాయకుడే కాకుండా మంచి నటులు కూడా. ఆయన అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలను కూడా పొందటం విశేషం. అలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి బాలసుబ్రహ్మణ్యం జన్మదినం సందర్భంగా ఆయనకు తెలుగువన్ డాట్ కామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది