|
Ide Indriya Nigraham | Lord Indra | Lord Narada | Narada Munni
|
జయమా ... పరాజయమా? |
తరువార దేవేంద్రుడే విషయం తెలుసుకుందామని స్వయంగా భూలోకం వచ్చి నారదుని తపస్సు పదవికోసం కాదని తెలుసుకుని ఊపిరి పీల్చుకుంటాడు.
ఇంతవరకూ బాగానే ఉందిగానీ, ఇంతమంది అందగత్తెలు తనను మాయలో పడేద్దామని వచ్చినా తాను ఇసుమంతైనా లొంగలేదన్న భావం నారదునిలో ఒకింత అహాన్ని పెంచుతుంది. అది ఇంతింతై వటుడింతైనట్టు .. రోజురోజుకూ పెరుగుతూ ఉంటుంది. మనస్సును, ఇంద్రియాలను జయించిన వాడినన్న గర్వంతో ఉన్న నారదుడు ఒకసారి మాతాపితురులైన బ్రహ్మసరస్వతీ వద్దకు వచ్చి వారికి నమస్కరించి ఇలా అంటాడు .....!
‘’జననీ జనకులారా! మీ మానసపుత్రుడినైన నేను ఇన్నాళ్ళకు ఒక గొప్ప విజయం సాధించాను. అదేమిటంటారా? నాకు ఇంద్రియాల మీద పట్టు దొరికింది. దాంతో అతిముఖ్యమైన మొహాన్ని జయించాను?’’ అంటూ గర్వంగా జరిగింది చెబుతాడు. |
|
నారదుని ద్వారా ఆ సంగతి విన్న బ్రహ్మదేవుడు లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం మౌనంగానే ఉంటాడు. దాంతో తన విజయాన్ని తండ్రి అంగీకరించినట్టుగానే నారదుడు భ్రమించి మరోసారి వాణీహిరణ్యగర్భులకు నమస్కరించి అక్కడినుండి కైలాసానికి వస్తాడు.
అక్కడ పార్వతీనాథున్నిచూసి భక్తితో నమస్కరించి, ‘’కైలాసవాసా! మాయను జయించడం చాలా కష్టమని అందరూ అంటూ వుంటారు. కానీ నేను ఆ మాయను అతి సులభంగా జయించాను. అందులోనూ నేను జయించింది సామాన్యమైన మాయను కాదు. ఈశ్వర మాయను’’ అని చెబుతాడు. దానికి శివుడు నవ్వుతూ ‘’నారదా! నా మాయను నేనే తెలియలేను. అటువంటిది నువ్వెలా జయించావు? ఇదే జరిగితే నీవు చాలా గొప్పవాడివి కిందే లెక్క. అయినప్పటికీ ఈ మాయావిషయంలో నీవు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. నీకు విజయాన్ని ఇచ్చినట్టే ఇచ్చి నిన్ను ప్రలోభానికి గురిచేయవచ్చు’’ అని అన్యాపదేశంగా హెచ్చరిస్తాడు శివుడు. అక్కడినుంచి సెలవు తీసుకుని ఇక సరాసరి వైకుంఠానికి ఆగమిస్తాడు నారదుడు. అక్కడ పాలకడలిలో శేషతల్పంపై శయనించి ఉన్న శ్రీహరిని చూసి భక్తితో చేతులు జోడించి నమస్కరిస్తాడు నారదుడు. తాపసోత్తముణ్ణి చూసిన వెంటనే లక్ష్మీసమేతుడై నారాయణుడు నారదుడికి ఎదురువచ్చి ఆర్ఘ్యపాద్యాదులను ఇచ్చి ఉత్తమ ఆసనంపై ఆశీనుణ్ణి చేసి గౌరవిస్తాడు శ్రీహరి. కుశల ప్రశ్నల అనంతరం ‘’స్వామీ! నేను హిమాలయాల్లో ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేస్తున్నాను. ఇప్పటికి శివమాయను జయించాను. విష్ణుమాయను కూడా జయించగలననే అనుకుంటున్నాను’’ అంటూ
‘’హరుమాయను గెలిచితి శ్రీ
హరి! నమ్ముమునాదుమాట అశ్రితపోషా!
స్థిర చిత్తుడనైతిని నీ
హరి మాయకుకూడ లొంగనంబుజనాభా!!’’
అంటున్న నారదుని దర్పపుమాటల్ని ఆలకించిన శ్రీహరి ఇలా అంటాడు ‘’నారదా! ఏదైనా మాయను గెలవడం అనేది సామాన్య విషయం కాదు. అయినా ఈ మాయ అనేది ఎవ్వరికీ అందదు. అన్నిటికీ అతీతమైనది. దాన్నే ‘పరాశక్తి మహామాయ’ అంటారు. ఇది తెలియనివాళ్ళు శివమయ, విష్ణుమాయ అని భ్రమపడుతూ ఉంటారు. కానీ ఇది నిజం కాదు. మహామాయే ప్రకృతి రూపంలో శివుడినీ, నన్ను కూడా లోబరుచుకుని మా ద్వారా ప్రపంచాన్ని తన ఇష్టం వచ్చిన రీతిలో ఆడిస్తూ ఉంటుంది. ఆ మాయలో పడకుండా దీన్ని వశపరచుకోవడం అనేది అంత సులభం కాదు. ఇది తెలియని వారు నేను మాయను గెలిచానంటూ సంబరపడి పోతుంటారు. ఇది కూడా ఆ మాయలో ఒక భాగమే. ఎందుకైనా మంచిది. ఈ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండడమే అన్ని విధాలా శ్రేయస్కరం’’ అని చల్లగా చెబుతాడు. ఇదంతా విన్న నారదుడు చిన్నబుచ్చుకుంటాడు. అయినా దీన్ని పైకి కనిపించనీయకుండా అక్కడినుంచి వెనుదిరుగుతాడు. |
ఇంకా ఉంది..... |
|
|
|
|