|
shivapuraanaam |shiva |puraanaam |telugu |brama |srusti |maha |lingam |parameswarudu |peru |vishunuvu |sakarudai |tamo |saraswathi.
‘అహం’బ్రహ్మపై ఆగ్రహం |
‘’అనవసరమైన దర్పానికి, అహంకారానికి పోయి మనిద్దరం విరోధం పెంచుకోవడం దేనికి? చూశావు కదా! దానివల్ల ప్రయోజనం లేకపోగా ప్రయాసే మిగిలింది. ఇంతచేసినా ఇద్దరమూ కలిసి ఆ మహాశివుడినే మనసారా ప్రార్థించి మన వివాదాన్ని పరిష్కరించమని కోరుకుందాం’’ అంటాడు విష్ణుమూర్తి.అప్పటికే బాగా అలసిపోయిన బ్రహ్మ అందుకు మారుమాట్లాడకుండా అంగీకరిస్తాడు. దాంతో ఉభయులూ ఆ మహాలింగాన్ని వివిధ రకాలుగా స్తుతిస్తారు. ‘’ఆద్యంతాలు లేని మహానుభావుడివి, అజరామరుడివి, నిన్ను ఏ రూపంలో కోలుచుకోవాలో, ఏ పేరుతొ పిలుచుకోవాలి? అజ్ఞానంతో మాకు మేమే గొప్ప అనుకుంటూ నీ మహిమను, విశేషాల్ని తెలుసుకోలేక పోయాం. |
|
మా అపరాధాన్ని మన్నించి నీవు సాకారుడవై సాక్షాత్కరించి మా వివాదాన్ని పోగొట్టి ఈ సృష్టికార్యం సజావుగా సాగిపోయే౦దుకు అవకాశం కల్పించు’’ అంటూ ఇద్దరూ పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ప్రార్థిస్తారు. దాంతో ఆ మహాలింగం నుంచి స్వచ్చమైన, నిర్మలమైన తెల్లని కాంతిపుంజాలు వెలువడ్డాయి.. ఆ కాంతిపంజాలే ఒక ఆకారంగా ఏర్పడి అవే మహేశ్వరుడిగా బ్రహ్మవిష్ణువుల కనుల ముందు రూపుదిద్దుకున్నాయి. ఆ సమయంలో ప్రణవ నాదమైన ఓంకార ధ్వనులు అక్కడంతా మారుమోగిపోతున్నాయి. పంచముఖాలతోనూ, త్రిశూలమూ, డమురకము, ఇత్యాదివి ధరించి మహాశివుడు అక్కడ సాక్షాత్కరించాడు.
అలా వారి మధ్య సాకారుడై ప్రత్యక్షమైన పరమేశ్వరుని దర్శించి పులకితుడైన మహావిష్ణువు పరమేశ్వరుని పాదాలంటి నమస్కరిస్తాడు. అందుకు ఎంతగానో సంతోషిస్తాడు పరమేశ్వరుడు. అనంతరం బ్రహ్మను చూసి –
‘’ఓ బ్రహ్మా! ఈ సృష్టికార్యం సజావుగా సాగే౦దుకు విష్ణుమూర్తి నాభినుంచి నీవు ఉదయించావు. నీకు తోడుగా సరస్వతీదేవి నిన్ను అనుసరించే ఉంది. అయితే నిన్ను తమోగుణం ఆవరించి ఉండడంతో ఎవరు ఎవరో తెలుసుకోలేక పోతున్నావు! నీ ఆవిర్భావానికి కారకుడైన విష్ణుమూర్తినే ధిక్కారస్వరంతో తిరస్కరిస్తున్నావు. ఇది నీకు తగినపని కాదు’’ అంటూ అసలు విషయాన్ని తెలియచేస్తాడు.
అప్పటికీ బ్రహ్మదేవుడు అహంకారాన్ని విడిచిపెట్టకుండా, ‘’సృష్టికార్యం కోసం ఉదయించిన నాకు అయిదు తలలు ఉండడంతో అర్థం ఉందికానీ, నీకు కూడా అయిదు తలలు ఉండడంలో ఔచిత్యం ఏముంది? నేనే మీ అందరికన్నా అధికమైన వాణ్ణి, కాబట్టి వెంటనే నీ తలల్లో ఒకదాన్ని తగ్గించుకో’’ అంటాడు మూర్ఖంగా.
అవి విన్న పరమేశ్వరుడు ఆగ్రహోదగ్రుడవుతాడు.
‘’ధూర్తుడా! ఇంత చెప్పినా నీ మూర్ఖత్వాన్ని విదిచిపెట్టవా?’’ అంటూ రుద్రస్వరూపంతో తన ఎడమచేతి గోటిద్వారా బ్రహ్మదేవుడి ఐదుతలల్లో ఒక తలను ఖండించి వేస్తాడు. |
ఇంకా ఉంది..... |
|
|
|
|